
సుడాపై రియల్ పిడుగు
తగ్గిన ఆదాయం
● ఏడాదిన్నరగా నిలిచిన అభివృద్ధి పనులు ● ప్రభుత్వం నిధులు కేటాయించాలి
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)పై రియల్ ఎస్టేట్ ప్రభావం పడింది. దీంతో రోజు రోజుకు ఆదాయం పడిపోతోంది. 2017లో సుడాను ఏర్పాటు చేశారు. కాగా గత ఏడాదిన్నరగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. పలు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. సుడా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినా.. నిధులు లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు సైతం బిల్లులు చెల్లించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
సుడాకు తగ్గిన ఆదాయం
గతంలో సుడాకు సంవత్సరానికి రూ.6 నుంచి రూ.8కోట్ల ఆదాయం వచ్చేది. 2024–25లో రూ.5.4 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దీనిలో రూ.2.5 కోట్లు ఖర్చయ్యాయి. మిగతా డబ్బులను ఉద్యోగుల జీతాలు, విద్యుత్ బిల్లుల కోసం నిల్వ ఉంచారు.
సుడా వెంచర్లో అభివృద్ధి అంతంత మాత్రమే
మిట్టపల్లి శివారులో సుడా ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ స్కీంలో భాగంగా ప్రభుత్వ స్థలాన్ని సేకరించారు. 2023లో సుడా ఆధ్వర్యంలో 14 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేశారు. రైతులకు ఇవ్వగా మిగిలిన 101 ప్లాంట్లను మూడు మార్లు ఓపెన్ యాక్షన్ పెట్టగా 27 ప్లాట్లు మాత్రమే సేల్ అయ్యాయి. వెంచర్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్లాట్స్ సేల్ అయితే వచ్చే ఆదాయంతో సుడా పరిధిలో పలు అభివృద్ధి పనులు చేయాలనుకున్నారు. కానీ అవి సేల్ కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీనికి తోడు రియల్ రంగం కుదేలు కావడంతో ప్రైవేట్ వ్యాపారులు కొత్త వెంచర్లు ఏర్పాటు చేయలేదు. కొత్త భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం సుడాకు ఎవరు రాకపోవడంతో ఆదాయం తగ్గింది. ప్రభుత్వం ప్రత్యేకంగా సుడా అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆదాయం పెంచేందుకు కృషి
కొత్త వెంచర్లు ఏర్పాటు కాకపోవడం, నూతన ఇంటి నిర్మాణ పనులు యజమానులు చేపట్టడం లేదు. రియల్ ఎస్టేట్ అంతగా లేకపోవడంతో ఆదాయం ఎక్కువగా రావడం లేదు. సుడా ఆదాయం పెంచేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నా.
– అశ్రీత్ కుమార్, వైస్ చైర్మన్, సుడా
మూడేళ్లుగా సాగుతున్న రిసార్ట్ పనులు
రంగనాయకసాగర్ రిజర్వాయర్ను చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. కానీ సమీపంలో ఎలాంటి వసతి లేకపోవడంతో భోజనం, నైట్ హాల్ట్కు సిద్దిపేటకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో సుడా ఆధ్వర్యంలో రిసార్ట్ నిర్మించాలని నిర్ణయించారు. ప్రభుత్వం దాదాపు 1.5 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో 2022లో సుడా రిసార్ట్ పనులను ప్రారంభించింది. ఇప్పటి వరకు సుమారుగా రూ.1.5 కోట్లతో కాటేజీలు, రెస్టారెంట్ హాల్స్ను నిర్మించారు. నిధులు లేకపోవడంతో స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫౌంటేన్ నిర్మాణం చేపట్టలేదు. దీంతో వినియోగంలోకి రాలేదు.

సుడాపై రియల్ పిడుగు