ఢిల్లీ పార్లమెంట్కు చీకోడ్ విద్యార్థి
పాపన్నపేట(మెదక్): మన నాయకుడిని తెలుసుకోండి పేరిట ఈనెల 25న ఢిల్లీలోని పార్లమెంట్లో జరిగే కార్యక్రమానికి మండలంలోని చీకోడ్– లింగాయపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు. పదో తరగతి చదువుతున్న శివచైతన్య ఎన్సీఈఆర్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీ పర్యటనకు ఎంపికయ్యాడు. పార్లమెంట్లో జాతీయ నాయకుల జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నాడు. గైడ్ టీచర్గా కిషన్ప్రసాద్ ఎంపికయ్యారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
మూడు తులాల బంగారు
ఆభరణాల అపహరణ
కౌడిపల్లి(నర్సాపూర్): తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలో చోటుచేసుకుంది. ఆదివారం ఎస్ఐ మురళి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ షేక్ ఫాజిల్ శనివారం రాత్రి భార్యాపిల్లలతో కలిసి చిలప్చెడ్ మండలంలోని ఫైజాబాద్లోని అత్తగారి ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఇంట్లోకి కోతులు వెళ్లడంతో పక్కింటివారు చూసి, ఫోన్ చేసి చెప్పారు. దీంతో కంగుతిన్న అతను ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోని బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.20వేల నగదు చోరీ చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోచోట బైక్..
కౌడిపల్లి మార్కెట్ సమీపంలోని ఓ ఇంట్లో సీతారాంతండాకు చెందిన డోజర్ డ్రైవర్ కెతావత్ గణేశ్ అద్దెకు ఉంటున్నాడు. శనివారం పని ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చి బైక్ను ఇంటి ఎదుట పార్క్ చేసి పడుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పోతరాజుపల్లిలో రెండు దుకాణాల్లో..
రోడ్డు ప్రమాదంలో
దంపతులకు గాయాలు
కొండపాక(గజ్వేల్): ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈఘటన మండలంలోని దుద్దెడ శివారులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... చేర్యాల పట్టణానికి చెందిన రవి, రజిత దంపతులు ద్విచక్ర వాహనంపై మధ్యాహ్నం సిద్దిపేటకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రజిత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురికి...
కొండపాక(గజ్వేల్): ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కుకునూరుపల్లి మండలంలో ఆదివారం చోటు చేసకుంది. ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం... సికింద్రాబాద్కు చెందిన గవ్వల రవి కుటుంబీకులతో కలిసి కొమురవెళ్లి మల్లన్న దర్శనం కోసం కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో రాజీవ్ రహదారిపై ఉన్న చిన్న కిష్టాపూర్ క్రాస్ రోడ్డు వద్ద సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి కారును వెనక నుంచి ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. కారు వెనక సీట్లో కూర్చున్న సునీత, మిన్ను ప్రియ, శాన్వికి గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ కోదాటి మధుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.


