ధాన్యం కొనుగోళ్లు! | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు!

May 29 2025 9:59 AM | Updated on May 29 2025 9:59 AM

ధాన్య

ధాన్యం కొనుగోళ్లు!

చివరి దశకు..
ఇప్పటికే 91 కొనుగోలుకేంద్రాలు మూసివేత
● 1.21 లక్షల టన్నుల కొనుగోళ్లు పూర్తి ● మరో 25 వేల మెట్రిక్‌ టన్నులుకొనాల్సి ఉందంటున్న అధికారులు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : రబీ కొనుగోలు సీజనుకు సంబంధించిన ధాన్యం సేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. సుమారు 80% సేకరణ పూర్తయిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే నారాయణఖేడ్‌ డివిజన్‌లోని దాదాపు అన్ని కొనుగోలు కేంద్రాల్లో సేకరణ పూర్తయింది. మిగిలిన చోట్ల ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మరో 20% ధాన్యం సేకరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈసారి సుమారు 1.52 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు 1.21 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ పూర్తయింది. ఇంకా 20 వేల మెట్రిక్‌ టన్నుల నుంచి 25 వేల మెట్రిక్‌ టన్నులు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలు కాక రైతులు పడిగాపులు కాస్తున్నారు. గత పక్షం రోజులుగా జిల్లాలో ముందస్తు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేంద్రాల్లో ధాన్యాన్ని తడవకుండా ఉంచేందుకు రైతులు అనేక తంటాలు పడుతున్నారు.

ఇప్పటికే ఖేడ్‌ డివిజన్‌లో పూర్తయిన కొనుగోళ్లు

జిల్లాలో ఇప్పటికే నారాయణఖేడ్‌ డివిజన్‌లో ధాన్యం సేకరణ పూర్తయింది. ఈ ప్రాంతంలో చాలావరకు కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, ఎఫ్‌పీఓ..అన్నీ కలిపి సుమారు 218 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 91 కొనుగోలు కేంద్రాలు మూతపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా పుల్కల్‌, ఆందోల్‌, గుమ్మడిదల, కొండాపూర్‌, కంది, జిన్నారం తదితర మండలాల్లో ధాన్యం సేకరణ ఇంకా కొనసాగుతోంది.

సన్న రకం నామమాత్రమే..

ఈ సీజనులో సన్న ధాన్యం నామమాత్రంగానే కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. ఇప్పటివరకు 6,371 టన్నులు మాత్రమే ఈ సన్నధాన్యం కొనుగోలు చేశారు. అంటే మొత్తం కొనుగోలు చేసిన ధాన్యంలో కేవలం ఐదు శాతం మాత్రమే ఈ సన్నాలు కేంద్రాలకు వచ్చాయి. ప్రభుత్వం ఈ సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో ఈ సన్న రకం ధాన్యం తక్కువ విస్తీర్ణంలో సాగువుతుండగా చాలా మట్టుకు ఈ సన్నాలను ప్రైవేటు వ్యాపారులు, రైసుమిల్లర్లే కొనుగోలు చేశారు. కొంతమేరకు రైతులు తమ వినియోగం కోసమే ఉంచుకున్నారు. దీంతో కేంద్రాలకు ఈ సన్నాలు నామమాత్రంగానే వచ్చాయి.

రూ.236 కోట్ల చెల్లింపులు

కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 19,166 మంది రైతులకు రూ.249 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.236 కోట్లు రైతులకు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా సుమారు రూ.13 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.

ధాన్యం కొనుగోలు కేంద్రం

వర్షాలు లేకుంటే ఇప్పటికే పూర్తయ్యేది

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతోంది. ఇప్పటివరకు 1.21 లక్షల ధాన్యం కొన్నాం. మరో 25 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అనుకుంటున్నాం. ఈసారి ముందస్తు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వర్షాలు లేకుంటే ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేవి. వర్షాల నేపథ్యంలో సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం.

– అంబాదాస్‌ రాజేశ్వర్‌,

డీఎం, సివిల్‌ సప్లయ్‌

ధాన్యం కొనుగోళ్లు!1
1/1

ధాన్యం కొనుగోళ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement