
నకిలీ విత్తనాలపై నజర్
విత్తన ఎంపికే కీలకం
● రైతులు నకిలీ విత్తనాలు కొనొద్దు.. ● ఆఫర్లు చూసి మోసపోవద్దు ● ఎరువులు, విత్తన విక్రయాలపై నిఘా ● ఏఈఓల ద్వారా గ్రామాల్లో అవగాహన ● అన్నదాతలకు వ్యవసాయ అధికారుల సూచనలు
దుబ్బాకటౌన్/చిన్నకోడూరు(సిద్దిపేట): రైతన్నలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలంటే రైతన్న వేసే పంట విషయంలో విత్తనాల ఎంపికే కీలకం. దుక్కి దున్నింది మొదలుకొని పంట చేతికొచ్చే వరకు ప్రతీ చోట జాగ్రత్తలు పాటిస్తేనే మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని రైతులకు సూచిస్తున్నారు.
జిల్లాలో నకిలీ విత్తన విక్రయాలపై అధికారులు నిఘా పెంచారు. ప్రతీ గ్రామంలో విత్తన కొనుగోలు కేంద్రాల్లో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సైతం నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించింది. అయిన రైతుల అమాయకత్వాన్ని కొంతమంది సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
ఎరువుల విషయంలో జాగ్రత్తలు
పంటల అధిక దిగుబడికి ఎరువులు ఎంతో మేలు చేస్తాయి. కానీ కొందరు దళారులు, వ్యాపారులు నాసిరకం ఎరువులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఫలితంగా అమాయక రైతులు నష్టపోతున్నారు. ఈ మేరకు కొన్ని మెలకువలు పాటిస్తే నకిలీ ఎరువులను నివారించే అవకాశం ఉంది. ఎరువులను కూడా లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలి.బిల్లు తప్పనిసరి. డీలర్ బుక్లో రైతులు తప్పకుండా సంతకం చేయాలి.
విత్తనాలు కొనుగోలు చేసే ముందు సూచనలు
వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి.
బస్తాలపై పేరు, గడువు తేదీ వివరాలు తప్పకుండా గమనించాలి.
విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రశీదు తప్పకుండా తీసుకోవాలి.
రశీదుపై విత్తన రకం, గడువు తేదీ పేర్కొనేలా డీలర్ సంతకం తీసుకోవాలి. రైతు సంతకం కూడా ఉండేలా చూసుకోవాలి.
విత్తనాలను కొనుగోలు చేసే ముందు వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవడం మంచిది.
మార్కెట్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ధ్రువీకరించిన విత్తనాలు విక్రయిస్తారు. వీటిని కొనుగోలు చేసే సమయంలో బస్తాపై నీలి వర్ణం ట్యాగ్ ఉందో లేదో గమనించాలి.
లేబుల్ విత్తనాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. జిల్లాలో ఈ రకం విత్తనాలు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. వీటిని కొనుగోలు చేసే ముందు విత్తన సంచిపై ఆకుపచ్చ ట్యాగ్ కట్టి ఉంటుంది. దీనిపై విత్తన ప్రమాణాలు ముద్రించి విక్రయిస్తారు. ఈ విత్త్తనాలను రైతులు కేవలం ఆయా కంపెనీ నమ్మకంపై మాత్రమే కొనుగోలు చేయాలి.
బ్రీడర్ విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు విత్తన సంచికి పసుపు రంగు ట్యాగ్ ఉందో లేదో గమనించాలి.

నకిలీ విత్తనాలపై నజర్