
భూములకు పట్టాలివ్వండి
భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భారతి చట్టం అమలులో క్షేత్రస్థాయిలో రైతుల నుంచి భారీ ఎత్తున ప్రభుత్వానికి దరఖాస్తులు అందుతున్నాయి. ప్రభుత్వానికి వచ్చిన విజ్ఞప్తుల్లో తమ భూములకు పట్టాలివ్వాలని వచ్చిన వినతులే అత్యధికంగా ఉన్నాయి.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘‘ప్రభుత్వ భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్నాము. వాటికి పట్టాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు ఆ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయండి..’’అంటూ పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టంలో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద కొండాపూర్ను ఎంపిక చేసిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టులోభాగంగా ఈనెల 5 తేదీ నుంచి మండలంలోని భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వినతిపత్రాలు తీసుకున్నారు. ఈ దరఖాస్తుల్లో ఎక్కువగా ఈ ప్రభుత్వ భూములకు పట్టాలివ్వాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులే అధికంగా ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఐదు గుంటలు..పది గుంటలు.. ఎకరం..రెండు ఎకరాలు..ఇలా తమ భూములకు పట్టాలు ఇవ్వాలనే దరఖాస్తులు రావడం గమనార్హం. వీటితోపాటు తమ భూముల విస్తీర్ణం తక్కువగా రికార్డుల్లో ఉందని, వాటిని సరిచేయాలని కూడా రైతులు ఎక్కువగా దరఖాస్తులు చేసుకున్నారు. పౌతి కోసం కూడా వినతులు వచ్చాయి. సర్వే నంబర్లో పడిన తప్పులు సరిచేయాలని రైతులు అధికారులకు ఇచ్చిన దరఖాస్తుల్లో పేర్కొన్నారు. అన్ని రకాల దరఖాస్తులు కలిపి ఈ పక్షం రోజుల్లో 1,718 దరఖాస్తులు వచ్చాయని మండల రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
ప్రతీ రెండు గ్రామాలకో అధికారుల బృందం
కొండాపూర్ మండలంలో మొత్తం 23 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టారు. ఆయా గ్రామాలకు వెళ్లి ఈ దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. అలాగే ఈ భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించనున్నారు. ఇందుకోసం 12 బృందాలను నియమించారు. ప్రతి రెండు గ్రామాలకు ఒక బృందం ఈ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టారు. ఇందుకోసం 12 మంది చొప్పున డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లను నియమించారు. జిల్లాలో ఉన్న రెవెన్యూ యంత్రాంగంలో దాదాపు సగంమంది డీటీలు, ఆర్ఐలు, ఇతర సిబ్బంది ఈ పైలెట్ ప్రాజెక్టుపైనే పనిచేస్తున్నారు. ఈ బృందాలు ఇకపై ప్రతీ గ్రామానికి వెళ్లి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు.
భూ భారతి పైలెట్ ప్రాజెక్టులో
భారీగా దరఖాస్తులు
ఇక క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం
డీటీలతో 12 అధికారుల
బృందాల నియామకం
మంత్రుల సందర్శన..
భూభారతి పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న కొండాపూర్ మండలాన్ని ఇటీవల రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సందర్శించిన సంగతి తెలిసిందే. జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు, పొంగులేటి, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్ వల్లూరు క్రాంతి తదితరులు అక్కడ జరిగిన రైతు సదస్సులో పాల్గొన్నారు. వచ్చిన దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను చేపట్టామని, రికార్డులను వెరిఫికేషన్ చేసుకుని దరఖాస్తులను పరిష్కరిస్తామని మండల రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.

భూములకు పట్టాలివ్వండి