
పచ్చిరొట్ట.. సాగుకు దిట్ట
జిల్లాకు పచ్చిరొట్ట విత్తనాలు
● 5,320 క్వింటాళ్లు మంజూరు
● జీలుగ, జనుము విత్తనాల పంపిణీకి కసరత్తు చేస్తున్న అధికారులు
జహీరాబాద్ టౌన్: జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి పచ్చిరొట్ట ఎరువులు వేసేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వానా కాలం సీజన్ ప్రారంభంతోనే జీలుగ, జనుము విత్తనాలను పంపిణీ చేయడానికి ప్రణాళిలు సిద్ధం చేస్తుంది. అవసరాలకు అనుగుణంగా మండలానికి విత్తనాలను సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటుంది. జిల్లాకు 3,380 క్వింటాళ్ల జీలుగ, 1,850 క్వింటాళ్ల జనుము విత్తనాలు మంజూరయ్యాయి. మండల వారీగా విత్తనాల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
రసాయనాలు, ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల భూమిలోని సారం పూర్తిగా తగ్గుతుంది. భూసారం పెంపునకు పచ్చిరొట్ట ఎరువులు వాడాల్సి ఉందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేస్తుంది. జీలుగ, జనుము విత్తనాలను తొలకరి వర్షాలు కురువడంతోనే విత్తనాలను విత్తడం ప్రారంభిస్తారు. విత్తనాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తుంది. జీలుగ విత్తనాలు కిలో ధర రూ. 142.50 ఉంది. ప్రభుత్వం 50 శాతం రాయితీ ప్రకటించగా రైతుకు రూ.71.50 లభిస్తుంది. 30 కిలోల బస్తా రూ.2,137.50 దొరుకుతుంది. జనుము కిలో విత్తనం ధరం రూ.125.30 ఉండగా రాయితీ పోనూ రైతుకు రూ.62.75 వస్తుంది. 40 కిలోల బస్తా ఒక్కోటి రూ.2,510కి రైతుకు లభిస్తుంది.
మండల వారీగా విత్తనాల మంజూరు
జిల్లాకు 5,320 క్వింటాళ్ల జీలుగ, జనుము విత్తనాలు మంజూరయ్యాయి. 3,380 క్వింటాళ్ల జీలుగ, 1,850 క్వింటాళ్ల జనుము విత్తనాలు ఉన్నాయి. అందోల్కు 450 క్వింటాళ్లు, చౌట్కూర్కు 160, గుమ్మడిదలకు 110, హత్నూరకు 340, ఝరాసంగంకు 180, జిన్నారానికి 190, కల్హేర్కు 260, కోహీర్కు 180, కంగ్టికి 200, కొండాపూర్కు 340, మనూర్కు 40, మొగుడంపల్లికి 80, మునిపల్లికి 180, నారాయణఖేడ్కు 200, నిజాంపేట 160, న్యాల్కల్కు 210, పటాన్చెరుకు 260, పుల్కల్కు 410, రాయికోడ్కు 120, రాంచంద్రపురానికి 80, సదాశివపేటకు 240, సంగారెడ్డికి 400, సిర్గాపూర్కు 60, వట్పల్లికి 140, జహీరాబాద్కు 240 క్వింటాళ్ల విత్తనాలు మంజూరయ్యాయి.
త్వరలో విత్తనాలు పంపిణీ
జిల్లాకు మొదటి విడత కింద జీలుగ, జనుము విత్తనాలు మంజూరయ్యాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు త్వరలో పంపిణీ మొదలు పెడుతాం. పంపిణీ కేంద్రాలను ఎంపిక చేశాం. రైతులు ఆధార్ కార్డు, పట్టా పాసు పుస్తకంతో మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. పచ్చిరొట్ట వల్ల నేలలో మొక్కలకు భాస్వరం, పోటాష్ అందడమే గాక గాలిలోని నత్రజని నేలలో స్థిరీకరించబడుతుంది. సూక్ష్మ పోషకాలు మొక్కలకు లభ్యమై పంట ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. పంట వేళ్లు కూడా ఆరోగ్యం, పటుత్వం పెరుగుతుంది. ఒక్కో బస్తా ఎకరానికి కంటే ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు.
– భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్

పచ్చిరొట్ట.. సాగుకు దిట్ట