
సానబెడుతూ.. సాధన చేయిస్తూ
● తెలంగాణ రైజింగ్ పేరుతోవేసవి శిక్షణ శిబిరాలు ● విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతీ మండల కేంద్రంలో ఏర్పాటు ● వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ● విద్యార్థుల నుంచి స్పందన భేష్
సంగారెడ్డి జోన్: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీసే ఉద్దేశంతో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వేసవి కాల శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. అందుకనుగుణంగా ప్రతీ మండలంలో వీటిని నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. విద్యార్థులకు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించేలా వివిధ అంశాల్లో శిక్షణనివ్వనున్నారు.
సెలవులు సద్వినియోగం చేసుకునే దిశగా
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే దిశగా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 7 నుంచి 14 ఏళ్ల లోపు ఉన్న బాల బాలికలకు క్యాంపులలో 15రోజులపాటు ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతీ మండల కేంద్రాల్లో ఈ శిక్షణ శిబిరాలను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం 22 మండలాల్లో ఈ వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతుండగా...మిగతా మండలాల్లో కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 1,348 ప్రభుత్వ పాఠశాలలో ఉండగా ఆయా పాఠశాలల్లో 1.35లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరితోపాటు ప్రైవేట్ పాఠశాలలు చదువుకునే విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తున్నారు.
పలు అంశాలపై శిక్షణ
క్యాంపులో భాగంగా బాలబాలికలకు కుట్లు, అల్లికలు, బొమ్మలు తయారు చేయడం, చిత్ర లేఖనం, డ్యాన్స్, కంప్యూటర్ శిక్షణ, యోగ, చేతిరాత అభివృద్ధి పరుచుకోవడం, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా మండలాల్లో స్థానికంగా ఉన్న వనరులను దృష్ట్యా ఆయా అంశాలపై కూడా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మండలాలలో శిక్షణ శిబిరాలకు అనూహ్య స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన సమ్మర్ క్యాంపులో ఒక రోజులో సుమారు 400 మంది విద్యార్థుల వరకు హాజరవుతున్నట్లు వెల్లడించారు.
ప్రతీ శిబిరానికి రూ.50 వేలు కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమ్మర్ క్యాంపునకు జిల్లాలో తెలంగాణ రైజింగ్ ఉచిత వేసవి శిక్షణ శిబిరంగా పిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేసి క్యాంపు నిర్వహణకు ప్రతి కేంద్రానికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు జిల్లాలోని 28 క్యాంపులకు రూ.14లక్షలు మంజూరయ్యాయి. మంజూరయిన నిధులతో శిక్షణ అందించే వారికి వేతనం, స్నాక్స్, అవసరమయ్యే సామగ్రి కొనుగోలు చేసేందుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
చిత్రలేఖనం నేర్చుకుంటున్నా
ఈ శిబిరంలో నేను డ్రాయింగ్ నేర్చుకుంటున్నా. క్యాంపులో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. చదువుకోవటంతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
– గాయత్రి, చేర్యాల గ్రామం,
కంది మండలం
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఉద్దేశంతో ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాం. కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో క్యాంపులు కొనసాగుతున్నాయి. అర్హులైన బాలబాలికలు సద్వినియోగం చేసుకుని రాణించాలి. వేసవి శిబిరాలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతీ మండలంలో క్యాంపు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, సంగారెడ్డి

సానబెడుతూ.. సాధన చేయిస్తూ

సానబెడుతూ.. సాధన చేయిస్తూ

సానబెడుతూ.. సాధన చేయిస్తూ