నంగునూరు(సిద్దిపేట): రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు గట్టమల్యాల ఉన్నత పాఠశాల నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికయ్యారని హెచ్ఎం రమేశ్, ఫిజికల్ డైరెక్టర్ రాజ్కుమార్ తెలిపారు. గురువారం వారు మట్లాడుతూ.. పాఠశాలకు చెందిన ఈశ్వరి, వైష్ణవి, కిరణ్వి, షణ్ముఖ ప్రియ, డీ.అను, అశ్విని, హరిణి ప్రియ, అఖిల మంచి ప్రతిభ కనబర్చారన్నారు. 2 నుంచి జగిత్యాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు వీరు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. విద్యార్థుల కోరిక మేరకు గట్లమల్యాలలో వారం రోజులపాటు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసి సాఫ్ట్బాల్ క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి మెలకువలు నేర్పించామన్నారు.
ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం
చిన్నశంకరంపేట(మెదక్): గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి కాపర్వైరుతోపాటు ఆయిల్ను చోరీ చేశారు. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో చోటు చేసుకుంది. సూరారం గ్రామ శివారులోని పంట పొలాలకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగులు రాత్రి సమయంలో ధ్వంసం చేశారు. విలువైన కాపర్ వైరు, ఆయిల్ చోరీ చేసినట్లు గుర్తించిన రైతులు ట్రాన్స్కో లైన్మెన్ భిక్షపతి దృష్టికి తీసుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి చోరీ చేసిన ఘటనపై పోలీస్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
8న పుస్తకాల ఆవిష్కరణ
సిద్దిపేటకమాన్: ప్రముఖ కవి అలాజ్పూర్ కిషన్ రచించిన ‘పేగు తెగిన పాట’, ‘వడిసెల’ కవిత్వం పుస్తకాల ఆవిష్కరణ 8న పట్టణంలో జరుగనున్నట్లు మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు కె.రంగాచారి తెలిపారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రెస్క్లబ్లో జరగనున్న ఈ సభకు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. సాహితీ ప్రియులు, కవులు, రచయితలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో యాదగిరి, శ్రీనివాస్, అశోక్, రాజ శేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
వెల్దుర్తి(తూప్రాన్) : మండలం పరిధి ధర్మారం అటవీ ప్రాంతంలోని నముండ్ల కుచ్చలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గ్రామానికి చెందిన సాయిరాం అనే వ్యక్తి గమనించి గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఎస్ఐ రాజు చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్లు ఉంటుందని, తలపై తెలుపు రంగు వెంట్రుకలు, ఒంటిపై ఎరుపు రంగు బనియన్, నలుపు రంగు ప్యాంటు ఉందన్నారు. కుడి చేతిపై ఇటికె అంజయ్య అనే పేరుతో పచ్చబొట్టు ఉందన్నారు. ఎవరైనా ఆనవాళ్లు గుర్తిస్తే వెల్దుర్తి పోలీ స్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించండి
తూప్రాన్: మున్సిపల్ పరిధిలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి మున్సిపల్ సిబ్బందికి సూచించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ, నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, నీటి పారుదల శాఖ వద్ద ఉన్న మొత్తం 173 పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అవినీతి ఆరోపణలకు తావులేకుండా పూర్తి చేయాలని సూచించారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గణేశ్ రెడ్డి, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక