
చేయూతపై చిగురిస్తున్న ఆశలు
కొత్త పెన్షన్ల మంజూరుకు కసరత్తు
● దివ్యాంగులు, వితంతువులకు ప్రాధాన్యం ● మూడేళ్ల తర్వాత మంజూరు
సంగారెడ్డి జోన్: కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో అర్హులైన వారి జాబితాలను సిద్ధం చేయా లని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అందించే పథకాలలో వివిధ పథకాలతో పాటు పింఛన్ల కోసం అధికంగానే దరఖాస్తు చేసుకున్నారు.
అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్న సెర్ప్
కొత్తగా మంజూరు చేసే పింఛన్లలో మొదటగా దివ్యాంగులతోపాటు వితంతువులకు అందించేందుకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు సమాచారం. అర్హులైన వారి జాబితాలను పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు సిద్ధం చేయనున్నారు.
జిల్లాలో 1,55,837 మంది పింఛనుదారులు
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి చేయూత పథకం ద్వారా ప్రతి నెలా పింఛను అందిస్తుంది. ఈ పథకం ద్వారా వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, కల్లుగీత కార్మికులు, డయాలసిస్, చేనేత వారికి పింఛన్ అందిస్తున్నారు. ఇందులో దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016లను అందిస్తుంది. ఈ మేరకు జిల్లాలో వివిధ కేటగిరీలలో 1,55,837 మంది చేయూత ద్వారా రూ.36,15,19,230లు లబ్ధిపొందుతున్నారు. ఆయా లబ్ధిదారులకు పోస్టాఫీసుతోపాటు బ్యాంకుల ద్వారా చెల్లింపులు కొనసాగుతున్నాయి.
జిల్లాలో పింఛన్ వివరాలు
దివ్యాంగులు 14,465
వృద్ధులు 59,083
వితంతువులు 70,673
ఒంటరి మహిళలు 7,475
చేనేత కార్మికులు 683
కల్లుగీత కార్మికులు 813
బీడీ కార్మికులు 112
ఇతరులు 2,533
మూడేళ్లుగా కొత్త పెన్షన్లు లేవు
అర్హులైన వారు చేయూత పథకం లబ్ధిపొందేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 2022 ఆగస్టు 31న నుంచి కొత్తగా పెన్షన్లు మంజూరు కాలేదు. దీంతో వందల మంది ఈ పథకానికి దూరంగా ఉన్నారు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకుని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు వేస్తున్నారు. తాజాగా పెన్షన్ల మంజూరు ప్రక్రియ ఊపందుకోవడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. తమకు గతంలో పింఛను వచ్చేదని గత కొన్నేళ్లుగా రావటం లేదని, అన్ని అర్హతలు కలిగి ఉన్నా పింఛను మంజూరు కావటం లేదని తదితర కారణాలతో కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్న సందర్భాలున్నాయి. త్వరితగతిన మంజూరు చేయాలని పింఛనుదారులు కోరుతున్నారు.