చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా భారత ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇందుకోసం చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ పంచాయతీ కార్యదర్శులను విరివిగా వినియోగిస్తుంది. దీనివల్ల జిల్లాలో పని చేస్తున్న పంచాయితీ కార్యదర్శులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల 30న పోలింగ్ ఉండగా.. దాని నిర్వహణకు పంచాయతీ కార్యదర్శులకు విధులు కేటాయించారు. ఈ నెల 29, 30న గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో అధికారులు, ఇతర సిబ్బందికి అవసరమైన భోజనం ఇతర మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత కార్యదర్శులు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారు నివసించే ప్రాంతానికి దూరంగా ఎన్నికల రోజున విధులు నిర్వహించాల్సి రావడంతో ఓటు వేయడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేద్దామన్నా అవకాశం లేకుండా పోయిందని కార్యదర్శులు వాపోతున్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఎన్నికల రోజున అధికారికంగా విధుల్లో ఉన్నట్లు దరఖాస్తు ఫాం 12కు ఆర్డర్ కాపీ జత చేయాల్సి ఉండగా పై అధికారులు మాత్రం మౌఖికంగా ఆదేశాలు జారీచేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.