కదం తొక్కిన ఎర్రదండు
తుర్కయంజాల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల శ్రమ శక్తిని నిలువునా దోపిడీ చేసే సాధనాలుగా మారాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య ధ్వజమెత్తారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం ఆదిబట్ల సర్కిల్ పరిధి తుర్కయంజాల్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దశాబ్దాల పోరాట ఫలితంగా వచ్చిన 8 గంటల పని విధానానికి స్వస్తి పలికి యజమానుల లాభాల కోసం పని భారాన్ని విపరీతంగా పెంచేలా ఈ చట్టాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల కొనుగోలు శక్తిని తగ్గించడం వల్ల దేశాభివృద్ధితో పాటు సామాన్యుల జీవితాలను దుర్భరం చేస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి. కిషన్, నాయకులు శివ ప్రసాద్, మాల్యాద్రి, శంకరయ్య, రోజా, భాస్కర్, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.


