ఉందామా.. తప్పుకొందామా!
● గ్రామ పోరులో పోటీపై అభ్యర్థుల డైలమా
● కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం
ఆమనగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు పోటీలో ఉందామా.. తప్పుకొందామా అంటూ సందిగ్ధంలో పడ్డారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల మండలాలలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పెద్ద ఎత్తున ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరించుకోవడానికి ఈనెల 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. దీంతో సర్పంచ్ పదవిలో కూర్చుందామనుకునే వారు పోటీ చేస్తున్న మిగతా అభ్యర్థులను బుజ్జగిస్తున్నారు. కొంతమంది నాయానో బయానో ఇచ్చి ప్రత్యర్థులతో బేరసారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్ వేసిన అభ్యర్థులు పోటీలో ఉందామా.. తప్పుకొందామా అనే డైలమాలో పడ్డారు.
నేడు ఉపసంహరణకు అవకాశం
సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్ వేసిన అభ్యర్థులు శనివారం మధ్యాహ్నం 3 లోపు ఉపసంహరించుకోవడానికి అ వకాశం ఉంది. నామినేషన్ ఉపసంహరణకు ఎ న్నికల సంఘం ప్రత్యేక గైడ్లైన్స్ జారీ చేసింది. అ భ్యర్థి సంబంధిత రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక ఫార్మాట్లో దరఖాస్తు అందించాలి. తానే స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నానని ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, డబ్బు ప్రలోభాలు లేవని స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలి. రిటర్నింగ్ అధికారి దానికి సంతృప్తి చెందినట్లయితే నామినేషన్ ఉపసంహరణ చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రక్రియ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తులను అధికారులు ప్రకటిస్తారు.


