
26న పాషనరహరి వర్ధంతి సభ
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలో ఈ నెల 26న నిర్వహించే కామ్రెడ్స్ మహబూబ్ పాష, నరహరి వర్ధంతి సభను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య పిలుపునిచ్చారు. సీపీఎం కమిటీ జిల్లా ముఖ్యనేతల సమావేశం ఆదివారం పట్నంలోని పాషనరహరి స్మారకకేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూములను పేదలకు పంచాలని, కూలీ రేట్లు పెంచాలని, అణగారిన వర్గాల అభ్యన్నతికి, వారి హక్కుల కోసం పోరాడిన పాషనరహరిలను హతమార్చిన విషయాన్ని గుర్తు చేశారు. వారి ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాంచందర్, సామేల్, చంద్రమోహన్, జగన్, నర్సింహ్మ, బుగ్గరాములు, జంగయ్య, అంజయ్య, రుద్రకుమార్లు పాల్గొన్నారు.
గ్లూకోజ్ కారణంగానే చనిపోయింది..
ఎమ్మెల్యే మల్రెడ్డికి వివరించిన మానస కుటుంబీకులు
మంచాల: గ్లూకోజ్ కారణంగానే గర్భిణి మానస చనిపోయిందని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు. వైద్య చికిత్స కోసం శుక్రవారం భర్త మధుతో కలిసి మానస స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు రాగా.. ఆమెకు గ్లూకోజ్ ఎక్కిస్తున్న క్రమంలో మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇదే విషయమై న్యాయం కోసం.. బాధిత కుటుంబం ఆదివారం నగరంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిశారు. వైద్యల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని, మృతురాలికి చిన్నబాబు ఉన్నాడని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీనిచ్చారు. కలెక్టర్, ఆర్డీఓతో మాట్లాడి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం, ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు, భర్త మధుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, బాలుడి చదువుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సదానందం, ప్రవీణ్, బూర కృష్ణ, విష్ణు వర్ధన్రెడ్డి, ప్రభాకర్, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
ఆగిఉన్న లారీని ఢీకొన్న డీసీఎం
ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
అబ్దుల్లాపూర్మెట్: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్నూర్ గ్రామానికి చెందిన చిత్తలూరి వెంకన్న కుమారుడు చిత్తలూరి గణేశ్(23), నాలుగు నెలలుగా ఎల్బీనగర్లోని దుర్గా ఫైర్ వర్క్స్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాణసంచా లోడ్ను శనివారం రాత్రి ఘట్కేసర్లో అన్లోడ్ చేశారు. అనంతరం మహేశ్వరం నుంచి గోదాం వద్ద ఔటర్రింగ్ రోడ్డు మీదుగా వెళ్తుండగా ఆదివారం తెల్లవారు జామున ఎగ్జిట్ నం.10 వద్ద, ఎలాంటి సిగ్నల్ లేకుండా రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న డీసీఎం డీకొట్టింది. ఈ ఘటనలో గణేశ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సందీప్, సతీష్లు గాయాపడ్డారు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇంజన్లో సాంకేతిక లోపం..
తాండూరు టౌన్: సాంకేతిక లోపం వలన ఓ ప్యాసింజర్ రైలు తాండూరు రైల్వే స్టేషన్లో రెండు గంటల పాటు నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి. వాడి నుంచి సికింద్రాబాద్కు వెళ్లాల్సిన వాడి ప్యాసింజర్ రైలు.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తాండూరుకు చేరుకుంది. తిరిగి వెళ్లే క్రమంలో మొరాయించింది. ఇంజన్లో సాంకేతిక లోపం ఉన్నట్లు లోకో పైలట్ గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా.. మెకానిక్లువచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అక్కడికి వచ్చిన ఓ గూడ్స్ ఇంజన్ను ప్యాసింజర్ బోగీలకు అమర్చి, రైలును సికింద్రాబాద్కు తరలించారు.