
గంజాయి మత్తులో యువత చిత్తు
పహాడీషరీఫ్: మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలంటూ ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేస్తున్నా నగర శివారుగా ఉన్న జల్పల్లి మున్సిపాలిటీగా గంజాయి గుప్పమంటుంది. పహాడీషరీఫ్, బాలాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలోకి వచ్చే ఈ మున్సిపాలిటీ పరిధిలో రాత్రయ్యిందంటే యువకులు బస్తీ చబుత్రాలలో తిష్ట వేస్తూ ఎంచక్కా గంజాయి పీల్చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారు. జల్పల్లి, పహాడీషరీఫ్, శ్రీరాం కాలనీ, వాదే ముస్తఫా, వాదే సాల్హె హీన్, షాహిన్నగర్, ఎర్రకుంట, ఉస్మాన్నగర్ తదితర బస్తీలలో రాత్రి పూట యువకులు గ్రూపులు గ్రూపులుగా జతకట్టి గంజాయి తాగుతూ బస్తీవాసులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే భౌతిక దాడులకు తెగబడుతున్నారు. వాదే ముస్తఫా బస్తీలోని మునీర్ మజీద్ పరిసరాలలో గంజాయి సేవిస్తున్న వారితో కొందరు స్థానికంగా ఇళ్లు సైతం ఖాళీ చేసి పోతున్నారని స్థానికులు తెలిపారు. అప్పుడప్పుడు పోలీసులు పెట్రోలింగ్కు వచ్చిన ఐదు, పది నిమిషాల పాటు వారికి చిక్కకుండా ఉండి, వారు వెళ్లాక తిరిగి బస్తీలలో న్యూసెన్స్కు పాల్పడుతున్నారు. గంజాయి మత్తులో ఒక్కోసారి హత్యలు, హత్యాయత్నాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి బస్తీలలో గంజాయి వినియోగదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
విద్యుదాఘాతంతో కూలీ మృతి
కొత్తూరు: పరిశ్రమకు కొత్తగా విద్యుత్ లైను ఏర్పాటు చేసేందుకు స్తంభాలు పాతుతున్న ఓ కూలీ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు పారిశ్రామికవాడలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పారిశ్రామికవాడలో ఉన్న ఓ బేకరి పరిశ్రమకు కొత్తగా విద్యుత్లైను వేసేందుకు పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విజయలక్ష్మి ధర్మకంట సమీపంలో స్తంభాలు పాతే క్రమంలో పక్కనుంచి వెళ్లిన విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా షాక్ కొట్టి జనగామ జిల్లాకు చెందిన మహేందర్(26) తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది కూలీకి సీపీఆర్ చేసి షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వ్యసనాల బారిన పడొద్దు
ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు
యాచారం: వ్యసనాల బారిన పడొద్దని, గ్రామాల్లో మద్యం, గంజాయి విక్రయిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు హెచ్చరించారు. మండల పరిధిలోని తక్కళ్లపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఆయ న పర్యటించారు. ప్రజలతో మా ట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంత కష్టపడైన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఉన్నత లక్ష్యంగా చదువుకోవాలని, ఉద్యోగాలు సాధించి ఊరికి మంచి పేరు తెచ్చి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి, మా జీ సర్పంచ్ సంతోష, మాజీ ఉప సర్పంచ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
గంజాయి, అల్ఫాజోలం పట్టివేత
కుత్బుల్లాపూర్: గంజాయి, అల్ఫాజోలం విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను మేడ్చల్ ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించా రు. జిల్లా ఎకై ్సజ్ అధికారి షేక్ ఫయాజుద్దీన్ కథనం మేరకు.. మహారాష్ట్ర పర్లీ–వైద్యనాథ్కు చెందిన మజ్లూమ్ ఖురేషీ, అబ్దుల్ రహమాన్ బైక్పై 10 కేజీల గంజాయిని కూకట్పల్లికి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు గంజాయిని సరఫరా చేసిన వసీమ్ పై కేసు నమోదు చేశారు. ఫిరోజ్గూడకు చెందిన రాగుల సాయికుమార్కారులో 2.5 కిలోల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. కూకట్పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన సంగారెడ్డి జిల్లా ముస్లాపూర్కు చెందిన బాల్రాజ్ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి 140 గ్రాముల అల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు, వాహనాలు, మొబైల్ ఫోన్ల విలువ రూ. 7.20 లక్షలు ఉంటుందని షేక్ ఫయాజుద్దీన్ తెలిపారు. దాడుల్లో సీఐ నర్సిరెడ్డి, ఎస్ఐ పవన్కుమార్రెడ్డి, సిబ్బంది సత్తార్, సంజయ్, మున్నాఫ్, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, చెన్నయ్యలు పాల్గొన్నారు.

గంజాయి మత్తులో యువత చిత్తు