
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో టోకరా
నిందితుడి అరెస్ట్
ఉప్పల్: సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసి రూ. లక్షలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని ఉప్పల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాలి ప్రాంతానికి చెందిన గిన్ని గోపి ఉప్పల్ ప్రాంతంలో లెన్స్ సాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నకిలీ కంపెనీ పేరుతో నకలీ లోగో సృష్టించి ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించి రూ. లక్షలు వసూలు చేసి వారికి నకిలీ ఆఫర్ లెటర్లు ఇస్తున్నాడు. వారు ఆఫర్ లెటర్లు తీసుకుని లెన్స్ సాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటేడ్ కంపెనీకి వెళ్లడంతో తాము ఎలాంటి లెటర్లు ఇవ్వలేదని తెలిపారు. కంపెనీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు గిన్ని గోపిగా గుర్తించారు. బుధవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసులపై దాడి కేసులో
నిందితుల రిమాండ్
ఉప్పల్: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసినా, విధులకు ఆటంకం కలిగించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉప్పల్ డీఐ రామలింగారెడ్డి అన్నారు. ఈ నెల 20న రాత్రి రామంతాపూర్ బోనాల పండుగ ఫలహార బండ్ల ఊరేగింపు సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న ఉప్పల్ ఎస్ఐ మధు, హెడ్ కానిస్టేబుల్ సురేష్, కానిస్టేబుల్ లకన్పై కొందరు యువకులు మద్యం మత్తులో దాడికి పాల్పడిని విషయం తెలిసిందే. నిందితులను భువనగిరి, రాజాపేటకు చెందిన ఇరానీ లక్ష్మణ్, అదే ప్రాంతానికి చెందిన నాగని శివ మనోహర్గా గుర్తించిన పోలీసులు బుధవారం వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అదే విధంగా ఫలహార బండ్ల ఊరేగింపులో నిర్లక్ష్యంగా కారు నడిపిన మామిడాల క్రాంతిని సైతం రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కారును సీజ్ చేసినట్లు తెలిపారు.
జోనల్ కార్యాలయంలో
చిల్లర దొంగ వీరంగం
కంప్యూటర్ వైర్లు కత్తిరించడంతో
ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
మూసాపేట: కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఓ చిల్లరదొంగ వీరంగం సృష్టించాడు. వెయిటింగ్ హాల్లో ఉన్న సర్వర్, ఇంటర్నెట్ వైర్లను కట్ చేయటంతో బుధవారం మూసాపేట, కూకట్పల్లి జంట సర్కిల్ కార్యాలయాలతో పాటు, జోనల్ కార్యాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. మున్సిపల్ అధికారులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్కు చెందిన ధనుంజయ్ అనే వ్యక్తి గత కొన్నాళ్లుగా జోనల్ కార్యాలయంలో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్నాడు. బాత్రూమ్లలో నల్లాలు, పైపులు, తదితర వస్తువులు చోరీ చేసి వచ్చిన డబ్బులతో మద్యం తాగేవాడు. బుధవారం తెల్లవారు జామున మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించిన అతను వెయిటింగ్ హాల్లోని కుర్చీలను, టేబుళ్లను చిందర వందర చేసి, ఇంటర్నెట్ మెయిన్ సర్వర్ వైర్లను, కంప్యూటర్ వైర్లను కట్ చేశాడు. దీనిని గుర్తించిన మున్సిపల్ సిబ్బంది అతడిని పట్టుకుని అక్కడే కట్టేశారు. తర్వాత కూకట్పల్లి పోలీసులకు అప్పగించారు. అతడి పూర్తి వివరాలు తెలియరాలేదన్నారు.

సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో టోకరా

సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో టోకరా