ఉద్యోగం చేస్తూ పీహెచ్‌డీ పట్టా | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం చేస్తూ పీహెచ్‌డీ పట్టా

Jun 27 2025 6:24 AM | Updated on Jun 27 2025 6:29 AM

ఉద్యో

ఉద్యోగం చేస్తూ పీహెచ్‌డీ పట్టా

ప్రతిభ చాటిన నంద్యాతండావాసి రాజునాయక్‌

కొందుర్గు: జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం నంద్యా తండాకు చెందిన రాజునాయక్‌ పీహెచ్‌డీ పట్టా పొందారు. లక్ష్మి, బోట్యానాయక్‌ దంపతులకు జన్మించిన ఆయన పదో తరగతి వరకు పరిసర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. మిగతా చదువులు కూడా సర్కారు కళాశాలలోనే పూర్తి చేశాడు. డిగ్రీ అనంతరం 2019 ఏప్రిల్‌ 11న జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం ఎల్కగూడ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం ఫరూఖ్‌నగర్‌ మండలం కంసాన్‌పల్లి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తన విద్యాభ్యాసం కొనసాగించారు. ‘ట్రైబుల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ నాన్‌ గవర్నమెంట్‌ ఆర్గనైజేషన్‌, ఏ స్టడీ ఆఫ్‌ మహబూబ్‌నగర్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ తెలంగాణ స్టేట్‌’ అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ బ్రహ్మానందం పర్యవేక్షణలో పరిశోధన చేశారు. ఇందుకుగాను గురువారం యూనివర్సిటీ అధికారుల చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా రాజునాయక్‌ను మండల వాసులు అభినందించారు.

పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్‌గా ప్రాణేశ్‌కుమార్‌

కడ్తాల్‌: మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం నూతన మేనేజర్‌గా ప్రాణేశ్‌కుమార్‌ నియమితులయ్యారు.ఈ మేరకు గురువారం పాలశీతలీకరణ కేంద్రంలోని కార్యాలయంలో మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గత కొంత కాలంగా పాలశీతలీకరణ కేంద్రానికి మేనేజర్‌ లేక పోవడంతో, ఇన్‌చార్జి మేనేజర్‌గా ఉదయశ్రీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ పాడి పారిశ్రామిభివృద్ధి సహాకార సమాఖ్య ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మహాబూబ్‌నగర్‌ పాలశీతలీకరణ కేంద్రం నుండి ప్రాణేశ్‌కుమార్‌ బదిలీపై కడ్తాల్‌ పాలశీతలీకరణ కేంద్రానికి రావడం జరిగింది.ఈ సందర్భంగా ప్రాణేశ్‌కుమార్‌ మాట్లాడుతూ, పాలశీతలీకరణ కేంద్రం పరిధిలో రైతులు నాణ్యమైన పాలను పోసి, అధిక ధరలను పొందాలని సూచించారు. పాలసేకరణ దారులు కూడ పాడి రైతులకు అవగాహన కల్పించి, నాణ్యమైన పాలను సేకరించాలని కోరారు. పాడి రైతులకు అందుబాటులో ఉండి పాడి రైతుల సమస్యల పరిష్కారాని కృషి చేస్తానని తెలిపారు.

కుక్కల దాడిలో ఐదు మేకల మృతి

యాచారం: మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో వీధి కుక్కల దాడిలో ఐదు మేకలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన అనేమోని రవీందర్‌ గురువారం మధ్యాహ్నం తన మేకలను పొలంలో మేపుతున్నాడు. గ్రామంలో ఉన్న వీధి కుక్కలు గుంపులుగా వచ్చి మేకలపై దాడి చేసి గాయపర్చడంతో ఐదు అక్కడికక్కడే మృతి చెందాయి. దాదాపు రూ.లక్షకు పైగా నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని పౌల్ట్రీఫాంల యజమానులు మృతి చెందిన కోళ్ల కళేబరాలను పొలంలో ఇష్టానుసారంగా పడేయడంతో వాటిని తింటున్న వీధి కుక్కలు మాంసం రుచి మరిగి జీవాలపై దాడులు చేస్తున్నాయని వాపోతున్నారు.

హైడ్రా పేరుతో బెదిరింపులు

నార్సింగి పీఎస్‌లో ఇద్దరిపై కేసు నమోదు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) పేరు చెప్పి బెదిరించిన ఇద్దరిపై నార్సింగి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. కరీంనగర్‌ నుంచి వచ్చి కారుడ్రైవర్‌గా పని చేస్తున్న మిరియాల వేదాంతం అల్కాపురి టౌన్‌షిప్‌లో నివసిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఈ ద్వయం నెక్నాంపూర్‌లోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో ఉన్న ఓ ఇంటి వద్దకు వెళ్లింది. నలుపు రంగు కారులో వచ్చిన వీరిద్దరూ ఆ ఇంటి ఆవరణలోకి వెళ్లి పరిశీలిస్తుండగా గమనించిన ఇంటి వద్ద పని చేసే గుంతకల్‌ మల్లికార్జున్‌ వారిని ఎవరంటూ ప్రశ్నించారు. తాము హైడ్రా నుంచి వచ్చామని చెప్పిన ద్వయం ఆ ఇంటిని కూల్చేస్తామని, దానికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. దీంతో మల్లికార్జున్‌ ఈ విషయంపై ఇంటి యజమానితో మాట్లాడాలని సూచించగా అక్కడ నుంచి జారుకున్నారు. ఈ మేరకు మల్లికార్జున్‌ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు ఇరువురినీ కస్టడీలోకి తీసుకున్నారు. హైడ్రా పేరు చెప్పి ఎవరైనా మోసాలకు, బెదిరింపులకు పాల్పడితే వెంటనే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైడ్రా గురువారం ఒక ప్రకటనలో కోరింది. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, నేరుగా తమకు ఆ సమాచారం ఇచ్చినా వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఏదైనా విషయంపై హైడ్రా ఉద్యోగులు విచారణ చేపడితే... అడిగిన వారికి పూర్తి వివరాలు అందిస్తారని పేర్కొంది. హైడ్రా ఉద్యోగుల్లో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినా, హైడ్రా పేరును దుర్వినియోగం చేసినా వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇలాంటి బెదిరింపు వ్యవహారాలు గమనిస్తే 8712406899 నంబరుకు ఫోను చేసి లేదా వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరింది. వీలుంటే వీరి ఫొటోలు కూడా షేర్‌ చేయాలని పేర్కొంది.

జాతీయ స్థాయి శిక్షణకు ఎంపిక

పూడూరు: కంకల్‌ పాఠశాల ఉపాధ్యాయుడు ఈశ్వరరావు జాతీయ స్థాయి శిక్షణకు ఎంకయ్యారని మండల విద్యాధికారి సాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయి విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో సత్తాచాటారన్నారు. నూతన అభ్యసన ప్రక్రియలకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి ప్రదర్శనలు రాగా ఉత్తమ ప్రదర్శన అందించిన ఉపాధ్యాయులను జాయతీ స్థాయికి ఎంపిక చేశారన్నాని స్పష్టంచేశారు. వీరు జూలై 3నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే శిక్షణలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా గురువారం కాంప్లెక్స్‌ హెచ్‌ఎం పుష్ప, లక్ష్మణ్‌, ఉపాధ్యాయులు ఈశ్వరరావును సన్మానించారు.

ఉద్యోగం చేస్తూ పీహెచ్‌డీ పట్టా 1
1/2

ఉద్యోగం చేస్తూ పీహెచ్‌డీ పట్టా

ఉద్యోగం చేస్తూ పీహెచ్‌డీ పట్టా 2
2/2

ఉద్యోగం చేస్తూ పీహెచ్‌డీ పట్టా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement