
మొక్కుబడిగా సామాజిక తనిఖీ
మంచాల: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల నిర్వహణపై మంచాలలో ఏర్పాటు చేసిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం గురువారం మొక్కుబడిగా సాగింది. ప్రజలు ఎవరూ హాజరు కాకపోవడంతో అధికారులు, సోషల్ ఆడిట్ సిబ్బందితోనే కార్యక్రమం ముగిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ఉపాధి హామీ పథకం కింద రూ.3.51 కోట్లు, అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ. 2.32 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.1.71 కోట్లు పని జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ పనుల నిర్వహణపై ప్రజా వేదికను డీఆర్డీఓ శ్రీలత ఆధ్వర్యంలో నిర్వహించారు. పనుల కొలతల్లో తేడాలు, బినామీల పేర్లతో పనులు చేసినట్లు తెలిసింది. పనుల వివరాలను రికార్డు నమోదు కూడా సక్రమంగా చేయలేదని తేలింది. ప్రధానంగా పని చేయని వారి పేర్ల మీద పని చేసినట్లు హాజరు నమోదైంది. ఈసీ ఫీల్డ్ విజిట్ చేయకుండా మంచాలలో నెల రాక ముందే రికార్డులు నమోదు చేశారు. ఏపీఓ సంతకాలు లేకుండా మస్టర్లు తయారు చేశారని ఆరోపించారు. రంగాపూర్ నర్సరీలో 40 వేల మొక్కలు ఎక్కడ నాటారనే విషయంలో స్పష్టత లేదు. అనంతరం డీఆర్డీఓ కల్పించుకొని.. కచ్చితంగా నర్సరీలలో పెంచిన మొక్కలు గ్రామంలో ఎక్కడెకక్కడ నాటారో రికార్డు చేయాలన్నారు. కొన్ని గ్రామాల్లో మస్టర్ పూర్తి చేసిన అనంతరం తిరిగి రాశారని సామాజిక తనిఖీ బృందం ఆరోపించింది. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ సుభాషిణి, ఎంపీడీఓ బాలశంకర్, అంబుడ్స్మెన్ సునీత, విజిలెన్స్ అధికారి కొండయ్య, ఏపీడీ చరణ్ గౌతమ్, సామాజిక తనిఖీ అధికారి అంజయ్యగౌడ్, ఎంపీఓ ఉమారాణి, ఏపీఓ వీరాంజనేయులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
రికార్డుల నిర్వహణలో అవకతవకలు
సమావేశంలో డీఆర్డీఓ శ్రీలత