
అర్జీల వెల్లువ
భూ భారతి సదస్సులకు బాధితుల క్యూ
● జిల్లా వ్యాప్తంగా 21,200 దరఖాస్తులు రాక
● ఆన్లైన్ ద్వారా ఇప్పటికే 17 వేలకుపైగా పెండింగ్
● తీవ్ర పని ఒత్తిడిలో రెవెన్యూ యంత్రాంగం
● మాడ్యుల్స్ వారీగా వివరాలు నమోదు చేస్తున్న అధికారులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఏళ్ల తరబడి అపరిష్కృతంగా మిగిలి ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈనెల 3 నుంచి గ్రామాల వారీగా భూ భారతి సదస్సులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు బృందాలుగా విడిపోయి గ్రామాలకు చేరుకుని బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరిస్తుండడం విధితమే. 27 మండలాల్లో 613 రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ బాధితుల నుంచి 21,200 దరఖాస్తులు స్వీకరించారు. అత్యధిక దరఖాస్తులు అందిన మండలాల జాబితాలో మంచాల (2,459) ముందు వరుసలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో యాచారం (1,867), కందుకూరు (1,863) ఉన్నాయి. అత్యల్ప అర్జీలు అందిన మండలాల జాబితాలో సరూర్నగర్ (0), హయత్నగర్ (3), రాజేంద్రనగర్ (7) నిలిచాయి. ఇప్పటికే 17 వేల మందికిపైగా బాధితులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆయా దరఖాస్తులన్నీ కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, తహసీల్దార్ల వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో మరో 60 అర్జీల వరకు వచ్చి చేరుతున్నాయి. రోజుకు సగటున 150 దరఖాస్తులను ఆమోదించడమో/ తిరస్కరించడమో చేస్తున్నారు. కొత్తగా అదే స్థాయిలో వచ్చి చేరుతున్నాయి. తాజాగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మరికొన్ని దరఖాస్తులు రావడం గమనార్హం. ఇప్పటికే పెండింగ్లో ఉన్న వాటితో పాటు కొత్తగా వచ్చి చేరిన అర్జీల పరిష్కారం రెవెన్యూ అధికారుకుల తలకుమించిన భారంగా మారుతోంది.
ఆయా మండలాల్లో ఇదీ పరిస్థితి
● పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిన కొందుర్గు మండలం నుంచి 573 అర్జీలు స్వీకరించారు.
● యాచారం మండలం మంతన్గౌరెల్లి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి, యాచారం, చింతపట్ల, మాల్, నల్లవెల్లి, నస్దిక్సింగారం గ్రామాల్లోనే ఎక్కువ భూ సమస్యలు ఉన్నట్లు తేలింది. కందుకూరులో మిస్సింగ్ సర్వే నంబర్లు సరి చేయడం కోసం 583, పెండింగ్ మ్యూటేషన్లు 172, డీఎస్ పెండింగ్ 101, విస్తీర్ణం సరిచేయడం కోసం 266, భూమి స్వభావానికి సంబంధించి 22, పట్టాదారు పేరు సరిచేయడం 77, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 253, ఓఆర్సీ కోసం 338, ఈ సర్టిఫికెట్ కోసం 1, సక్సేషన్ కోసం 213, ఇతర సమస్యల పరిష్కారం కోసం 172 దరఖాస్తులు అందాయి.
● కడ్తాల్ మండలంలో మిస్సింగ్ సర్వే నంబర్లు 270, పెండింగ్ మ్యూటేషన్ 65, విస్తీర్ణం తగ్గుదల 178, భూమి స్వరూపం మార్పు 62, నిషేధిత జాబితా నుంచి తొలగింపు కోసం 85, వారసత్వ పట్టా అమలు కోసం 38, కొత్త పాసుబుక్ల కోసం74, పేర్ల నమోదులో దొర్లిన తప్పులను సరి చేయడం, ఆధార్ నమోదు, కులం తప్పుగా నమోదుకు సంబంధించి 65, ఇతర దరఖాస్తులు 74 వరకు ఉన్నాయి.
● ఇబ్రహీంపట్నంలో 1,185 అర్జీలు అందగా, వీటిలో ఆరు సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలినవి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోయాయి.
● కేశంపేటలో మిస్సింగ్ సర్వేనంబర్ 165, మ్యూటేషన్ పెండింగ్ 6, డీఎస్ పెండింగ్ 30, ల్యాండ్ విస్తీర్ణం 44, భూమి స్వభావం 12, భూ యజమాని వివరాలు 10, నిషేధిత జాబితా 46, అసైన్డ్ల్యాండ్ 3, విరాసత్ 9 దరఖాస్తులు ఉన్నాయి.
● చేవెళ్లలో సర్వేనంబర్కు సంబంధించి 542, పెండింగ్ మ్యూటేషన్, కోర్టు ఆర్డర్కు సంబంధించి 48, డీఎస్ పెండింగ్ 153 అర్జీలు రాగా, ఎక్స్టెంట్ కరెక్షన్కు సంబంధించినవి 37, పేర్లు తప్పులు, మిస్సింగ్ 74, నిషేధిత జాబితా 57, అసైన్డ్ భూమికి సంబంధించి 1, ఓఆర్సీపై 4, సక్సేషన్ 39, ఆక్రమణలకు సంబంధించి 9, ఇతర సమస్యలపై 24 ఫిర్యాదులు అందాయి.
● మొయినాబాద్ మండలంలో 377 మిస్సింగ్ సర్వే నంబర్లు, 46 డీఎస్ పెండింగ్, 56 ఎక్స్టెంట్ కరెక్షన్, 76 భూ స్వభావం, 16 పట్టాదారు పేర్లలో తప్పులు, 107 నిషేధిత జాబితా, 112 సక్సేషన్, 121 ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి.
పరిష్కారం దొరుకుతుంది
గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. వచ్చిన అర్జీలను స్వీకరించాం. ఎప్పటికప్పుడు నమోదు చేసుకున్నాం. ఆయా సమస్యలను బట్టి సమయానుకూలంగా నోటీసులు ఇచ్చి భూ భారతిలో పరిష్కరించే విధంగా చూస్తాం.
– కృష్ణయ్య, తహసీల్దార్, చేవెళ్ల

అర్జీల వెల్లువ