
ప్రభుత్వ భూముల పరిశీలన
కొందుర్గు: మండల కేంద్రంలో అధిక విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను మంగళవారం అధికారులు పరిశీలించారు. కొందుర్గు పడమర శివారు సర్వే నంబర్ 150, 161లలో గల ప్రభుత్వ భూమిని జీహెచ్ఎంసీ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామునాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అత్యధిక విస్తీర్ణం గల ప్రాంతాలను గుర్తించి స్థలాలను పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. ఈ సర్వే నంబర్లలో మొత్తం ప్రభుత్వ భూమి 230 ఎకరాలు ఉందని, ఇందులో పేదలకు అసైన్డ్ చేయడంతో పాటు మైనింగ్ కోసం లీజుకు ఇచ్చింది పోను ఇంకా 150 ఎకరాల వరకు అందుబాటులో ఉందని తహసీల్దార్ రమేశ్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్ఐ శివకుమార్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.