
పరువు పోతుందనే హత్యకు పథకం
పరిగి: మండల పరిధిలోని రాపోల్లో మంగళవారం రాత్రి జరిగిన వృద్ధురాలి హత్య, ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై హత్యాయత్నం ఘటనకు సంబంధించిన వివరాలను పరిగి డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం మీడియాకు వెల్లడించారు. గ్రామానికి చెందిన పొట్టి రాంచరణ్ ఇంటర్ ఫెయిలై జులాయిగా తిరుగుతున్నాడు. ఈక్రమంలో ఖర్చుల కోసం వరసకు బావ అయ్యే రాజేందర్ ఇంట్లో తరచూ డబ్బులు దొంగిలించేవాడు. గత మంగళవారం రాత్రి సైతం రాజేందర్(ప్రభుత్వ ఉపాధ్యాయుడు) ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఇది గమనించిన అతను అరవడంతో రాంచరణ్ పారిపోయాడు. ఈ విషయాన్ని తన స్నేహితులైన చంద్రశేఖర్(బన్ని)తో పాటు మరో యువకుడికి చెప్పాడు. తాను చోరీకి వెళ్లిన విషయాన్ని ఉదయాన్నే గ్రామంలో అందరికీ చెప్పి, తన పరువు తీస్తాడని భావించి, అతన్ని చంపేద్దామన్నాడు. ఇందుకు స్నేహితులు సైతం వంతపాడారు. ఆవెంటనే రాంచరణ్ తన ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని, రాజేందర్ ఇంటికి చేరుకున్నారు. అతను నిద్రలో ఉండగా కత్తి, ఇనుప రాడ్డుతో రాంచరణ్ దాడి చేశాడు. మేల్కొన్న రాజేందర్ పెద్దగా అరవడంతో పక్క గదిలో పడుకున్న అతని తల్లి నర్సమ్మ వచ్చి, అడ్డుకుంది. దీంతో ఆమెను సైతం కత్తితో పొడిచి, బండరాయితో దాడి చేయగా అక్కడికక్కడే మృతిచెందింది. ఈ అలికిడికి చుట్టు పక్కల వాళ్లు లేవడంతో పారిపోయారు. దాడికి ఉపయోగించిన కత్తి, రాయి, ఇనుప రాడ్లను బావిలో పడేసేందుకు ప్రయత్నించగా.. కత్తి ఒడ్డుపైనే పడింది. రాంచరణ్, చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సంతోష్కుమార్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మృత్యువుతో పోరాటం..
దాదాపుగా 30కి పైగా కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడిన రాజేందర్ గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. కత్తితో దాడి చేసిన సమయంలో కొంత భాగం తలలో విరిగిపోయింది. ఆపరేషన్ ద్వారా కత్తి ముక్కను తొలగించినట్లు తెలిసింది. దాడిలో మృతిచెంది రాజేందర్ తల్లి నర్మమ్మ అంత్యక్రియలను బుధవారం పూర్తి చేశారు. కొడుకు లేకపోవడంతో భర్త చెన్నయ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
వరుసకు బావ అయ్యే వ్యక్తిపై
యువకుడి హత్యాయత్నం
కత్తి, ఇనుప రాడ్లతో
విచక్షణా రహితంగా దాడి
రాపోల్ ఘటన వివరాలను
వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్