
భూదాన్ బోర్డు భూ సమస్యలపై అర్జీలు
ఇబ్రహీంపట్నం: భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్గౌడ్ కోరా రు. ఇబ్రహీంపట్నం భాగాయత్, ఇస్మాయిల్ పంపు, తట్టిఖానా, అల్లిమియాకుంట రెవెన్యూ భూ సమస్యలపై మంగళవారం స్థానిక ఓసీ కమ్యూనిటీ హాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. సర్వే నంబర్ 58, సైదాబాద్ కంచె, భాగాయత్, తట్టిఖాన రెవెన్యూ పరిధి భూదాన భూములకు సంబంధించి అధికంగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఆ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని పలువురు విన్నవించినట్లు పేర్కొన్నారు. భాగాయత్ పరిధి 120, తట్టి ఖానా పరిధి 10, అల్లిమియా కుంట పరిధి నుంచి ఒక్క దరఖాస్తు అందిందని వివరించారు.
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య
ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, మీ పిల్లలను వాటిల్లో చేర్పించాలని ఇబ్రహీంపట్నం బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కోరారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇంటింటికి వెళ్లారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని, మధ్యలో బడి మానేసిన విద్యార్థులను తిరిగి చేర్చాలని సూచించారు. ఉచిత ప్రవేశం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో విద్యాబోధన జరుగుతుందని వివరించారు.
డీసీఎం బోల్తా, వ్యక్తికి గాయాలు
కడ్తాల్: కోళ్లను తరలిస్తున్న డీసీఎం వాహనం బోల్తాపడింది. ఈ సంఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోళ్లను సరఫరా చేసే డీసీఎం వాహనం మంగళవారం ఉదయం తలకొండపల్లి నుంచి కడ్తాల్కు బయలుదేరగా, మార్గ మధ్యలో మక్తమాధారం గేట్ సమీపంలో డ్రైవర్ అజాగ్రత్తతో కరెంట్ పోల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని కార్మికుడు రోషన్ కాళ్లకు గాయాలయ్యాయి. వాహన యాజమాని చెదురుపల్లి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు.
కిరాణా దుకాణాల్లో రేషన్ బియ్యం పట్టివేత
శంకర్పల్లి: కిరాణా దుకాణాల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పలు కిరాణ దుకాణాల్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచి అమ్ముతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మంగవారం పలు దుకాణాల్లో దాడులు నిర్వహించారు. కోటికే ధనుంజయ్ దుకాణంలో నాలుగు క్వింటాళ్లు, అలంపల్లి శ్రీధర్ దుకాణంలో 3.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకొని దుకాణ యాజమానులపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
అనంతగిరి: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం వికారాబాద్ – గోధుమగూడ రైల్వేస్టేషన్ల మధ్య ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే అధికారులు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని, చామనచాయ, బక్క పలుచని శరీరం కలిగి ఉన్నాడు. మృతుని ఒంటిపై తెలుపు నలుపు బూడిద రంగు డబ్బాల ఫుల్ షర్ట్, తెలుపు రంగు ప్యాంట్, నలుపు, ఎరుపు రంగు మొలతాడు ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురిలో భద్రపరిచనట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ హరిప్రసాద్ తెలిపారు. ఎవరైన ఆచూకీ తెలిసిన వారు ఉంటే వెంటనే సంప్రదించాలన్నారు.

భూదాన్ బోర్డు భూ సమస్యలపై అర్జీలు

భూదాన్ బోర్డు భూ సమస్యలపై అర్జీలు