
పది టిప్పర్లు, జేసీబీ సీజ్
షాబాద్: ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ హెచ్చరించారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడిన కొందరు ప్రభుత్వ భూముల్లోని మట్టిని అక్రమంగా తవ్వి, ప్రైవేట్ కంపెనీలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారని తెలిపారు. సోలీపేట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 350లో ఉన్న 120 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సమాచారం రావడంతో సోమవారం రాత్రి దాడులు నిర్వహించామన్నారు. పది టిప్పర్లు, ఒక జేసీబీని అదుపులోకి తీసుకున్నామని స్పష్టంచేశారు. వీటికి సంబంధించిన యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేశామన్నారు. మరోమారు ఇలాంటి అక్రమాలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని, ఈసీ వాగు నుంచి ఇసుక తరలిస్తున్న వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.
యజమానులు,డ్రైవర్లపై కేసులు నమోదు
మరోసారి పట్టుబడితేనాన్ బెయిలబుల్ కేసులు
షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్