
పేరుకే పార్కు!
ఎక్కడికక్కడపేరుకుపోయిన సమస్యలు
● ఆహ్లాదం పంచని అర్బన్ ఫారెస్టులు ● కరువైన కనీస మౌలిక సదుపాయాలు ● ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని అభివృద్ధి పనులు ● సందర్శకుల ఆదరణకు నోచుకోని ఉద్యానాలు
పట్టణ ఉద్యానాలు ఇలా..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎటూ చూసినా ఎత్తయిన భవనాలు.. ఇరుకై న రోడ్లు.. అంతా కాంక్రీట్ మయం. వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. వాహనాల రద్దీకి తోడు విపరీతమైన కాలుష్యం.. వెరసీ.. జనం స్వచ్ఛమైన గాలికి దూరమైన పరిస్థితి. ఈ విపత్కర స్థితి నుంచి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏటా కోటి మొక్కల చొప్పున నాటుతూ వస్తున్నారు. నగర వాసులకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పంచేందుకు ఔటర్ చుట్టూ ఉన్న ఫారెస్టులను అర్బన్ ఫారెస్టులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 21 వేల ఎకరాల విస్తీర్ణంలో 26 పట్టణ ఉద్యానాలను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించి, ఆ మేరకు అటవీశాఖ, హెచ్ఎండీఏలకు బాధ్యతలను అప్పగించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు చేపట్టిన పనులు పూర్తి కాకపోవడంతో సందర్శకుల ఆదరణకు నోచుకోలేకపోతున్నాయి. ఎటుచూసినా అర్బన్ ఫారెస్టులు ఎవరూ లేక వెలవెలబోతున్నాయి. గుర్రంగూడలోని సంజీవని, గండిపేట లేక్వ్యూ, కొత్వాల్గూడ ఎకో పార్కు మినహా మిగిలిన చోట్ల ఇప్పటికీ గేట్లు కూడా తెరుచుకోవడంలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పనులు అసంపూర్తిగానే..
● కందుకూరు మండలం లేమూరులో 58.78 హెక్టార్లలో మన్యంకంచె పార్కు అభివృద్ధి కోసం రూ.24.9 కోట్ల అంచనాలు రూపొందించారు. ఇప్పటికీ లెవలింగ్ సహా ప్రహరీ, ప్రధాన గేటు పనులు పూర్తికాలేదు. బెంగళూరు జాతీయ రహదారిపై ఓఆర్ఆర్కు 30 కిలోమీటర్ల దూరంలోని షాద్నగర్ మండలం కమ్మదనంలో 32.82 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.65.61 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. తుక్కుగూడ సమీపంలోని సిరిగిరిపురంలో 102.39 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.20.26 కోట్లతో అంచనాలతో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి.
● అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడెం రెవెన్యూ పరిధిలో 437.25 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.55.80 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అంబర్పేట్ అర్బన్ కలాన్ పార్కు అభివృద్ధి పనులది ఇదే పరిస్థితి. మహేశ్వరం మండలం హర్షగూడ సమీపంలో 87.41 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.25.24 కోట్ల అంచనా వ్యయంతో హెచ్ఎండీఏ ఈ పార్కును అభివృద్ధి చేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్–14 (తుక్కుగూడ) నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పార్కుకు చేరుకోవ చ్చు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. మహేశ్వరం మండలం నాగారం వద్ద 556.69 హెక్టార్లలోని అర్బన్ ఫారెస్ట్ పార్కు సహా 526 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.8 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన శ్రీనగర్ పార్కు అసంపూర్తిగానే మిగిలిపోయింది.
ప్రాంతం ఉద్యానం పేరు విస్తీర్ణం
(ఎకరాల్లో)
గుర్రంగూడ సంజీవని పార్కు 464.99
శంషాబాద్ గొల్లూరు 867.00
మహేశ్వరం మసీదుగడ్డ 445.00
చిల్కూరు మృగవని పార్కు 1210.96
శంషాబాద్ పంచవటి 166.00
శంషాబాద్ గండిగూడ 108.03
మహేశ్వరం తుమ్మలూరు 350.16
పెద్ద అంబర్పేట్ పెద్ద అంబర్పేట్ కలాన్ 1080.45