
ప్రజావాణి ఫిర్యాదులను శాఖల వారీగా సమీక్షించాలి
అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను శాఖల వారీగా సమీక్షించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం కలెక్టర్లోని సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె డీఆర్ఓ సంగీతతో కలిసి ఫిర్యా దులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదన పు కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజావాణికి వచ్చిన 56 ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం: చార్మినార్ జోన్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని తెలంగాణ సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో తాత్కాలిక ప్రాతిపదికన విద్యాబోధనకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జోనల్ అధికారి నిర్మల, జిల్లా సమన్వయ అధికారి బి.వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిలుకూరు బాలుర గురుకుల విద్యాలయంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, స్పెషల్ టీచర్లు, హైల్త్ సూపర్వైజర్లు, పీఈటీ, పీడీ, లైబ్రేరియన్ పోస్టులకు ఈనెల 30న, వృక్ష, జంతు శాస్త్రం, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబెక్ట్లకు ఈ నెల 31న ఉదయం 10 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ.. అనంతరం డెమో ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో హాజరు కావాలన్నారు. బాలికల విద్యాలయాల్లో మహిళలు మాత్రమే అర్హులన్నారు. జూనియర్ లెక్చరర్కు నెలకు రూ.23,400, పీజీటీ, టీజీటీ ఉపాధ్యాయులకు రూ.18,200 వేతనం చెల్లిస్తారని వివరించారు.
మహేశ్వరం ఏసీపీగా జానకీ రెడ్డి
పహాడీషరీఫ్: మహేశ్వరం డివిజన్ ఏసీపీగా ఎస్.జానకీ రెడ్డి సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేసిన లక్ష్మీకాంత రెడ్డి బదిలీ కావడంతో ఆయన స్థానంలో, హెచ్ఎండీఏలో డీఎస్పీగా ఉన్న 1998 బ్యాచ్కు చెందిన జానకీ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. డివిజన్ పరిధి లోని కందుకూరు, మహేశ్వరం, పహాడీషరీఫ్, బాలాపూర్ ఠాణాల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ఫిర్యాదుదారులు ఠాణాలకు వచ్చి ఫిర్యాదు చేసేలా ప్రశాంత వాతావరణం కల్పిస్తామన్నారు.
31న మందకృష్ణకు స్వాగతోత్సవం
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహ
షాద్నగర్: పద్మశ్రీ అవార్డు అందుకున్న మందకృష్ణ మాదిగ ఈ నెల 31న వరంగల్ రానున్న నేపథ్యంలో స్వాగతోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ తెలిపారు. సోమవారం పట్టణంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాగతోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వరంగల్ తరలిరాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు నాగభూషణం, బాలరాజు, శ్రావణ్కుమార్, ప్రవీణ్, లింగం, వెంకటేష్, దశరథ తదితరులు పాల్గొన్నారు.
జూన్ 6న ఖైరతాబాద్ మహాగణపతి కర్ర పూజ
ఖైరతాబాద్: ప్రతి యేటా వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులను జూన్ 6న నిర్జల ఏకాదశి రోజు కర్రపూజ నిర్వహించి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులను శాఖల వారీగా సమీక్షించాలి

ప్రజావాణి ఫిర్యాదులను శాఖల వారీగా సమీక్షించాలి