
మోక్షం కల్పించి.. వదిలేసి
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనిచందంగా మారింది వ్యవసాయ మార్కెట్లో నిర్మించిన మడిగెల పరిస్థితి. రూ.1.20 కోట్లువెచ్చించి మొదలు పెట్టిన దుకాణ సముదాయ నిర్మాణ పనులను.. తొలుత అసంపూర్తిగా వదిలేశారు. ఆ తరువాత మోక్షం కల్పించారు. అనంతరం యాక్షన్ వేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు.
ఇబ్రహీంపట్నం: స్థానిక మార్కెట్ యార్డు ఖాళీ స్థలంలో 2022 సంవత్సరంలో మార్కెటింగ్ శాఖ రూ.1.20 కోట్లతో 17 మడిగెల నిర్మాణ పనులు చేపట్టింది. ఇంజినీరింగ్, విద్యుత్ అధికారుల అలసత్వం కారణంగా.. చివరి దశ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. పనుల ఆటంకం నేపథ్యంలో గతేడాది ‘సాక్షి’లో ‘మడిగెలకు మోక్షమెప్పుడో’ అనే శీర్షికన ప్రచురించిన కథనానికి.. స్పందించిన అధికారులు.. వడివడిగా మిగతా నిర్మాణ పనులను పూర్తి చేశారు. పూర్తి చేసి ఆరు నెలలు అయినా.. వాటిని ప్రారంభించి, ఓపెన్ టెండర్లను పిలిచేందుకు మార్కెట్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
ప్రారంభిస్తే.. ఏటా రూ.40 లక్షల ఆదాయం!
ఇబ్రహీంపట్నం– నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై బస్టాండ్ సమీపంలోని మార్కెట్ స్థలంలో నిర్మించిన మడిగెలకు మంచి డిమాండ్ ఉంది. ఓపెన్ యాక్షన్ పెడితే ఒక్కో మడిగ రూ.20 వేలకు పైగానే పలికే అవకాశం ఉంది. దాంతో ప్రతి నెల రూ.3.50 లక్షల నుంచి 4 లక్షలు, ఏడాదికి సుమారు రూ.35 నుంచి 40 లక్షల వరకు అదనంగా మార్కెట్కు ఆదాయం సమకూరేది. ఇలా కాసులు కురిపించే దుకాణ సముదాయాన్ని త్వరగా ప్రారంభించాలన్న ఆలోచనను సంబంధిత అధికారులు విస్మరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మడిగెలకు ఓపెన్ యాక్షన్ ఎప్పుడేప్పుడాని చిన్న, పెద్ద వ్యాపారులు ఎదురుచూస్తున్నారు. వాటిల్లో ఏ వ్యాపారం చేసినా విజయం సాధిస్తామనే నమ్మకంతో ఆశగా ఉన్నారు. గతంలో ఈ మార్కెట్ యార్డులో నిర్మించిన 53 మడిగెలకు ఆ కాలంలో నిర్వహించిన ఓపెన్ యాక్షన్లో ప్రతినెల అద్దె రూపంలో రూ.5 లక్షల ఆదాయం వస్తోంది. ఇప్పుడు పెరిగిన కిరాయి ప్రకారం కొత్త మడిగెలకు ఓపెన్ టెండర్లలో భారిగానే ఆదాయం రానుంది.
ఎమ్మెల్యే గారు.. దృష్టిపెట్టండి
మడిగెలను ప్రారంభించి, టెండర్లు పిలిచే అంశంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతి నెల అద్దె రూపంలో వచ్చే ఆదాయంతో వ్యవసాయ మార్కెట్ మరింత అభివృద్ధి చెందుతుందని, సంబంధిత అధికారులతో మాట్లాడి, త్వరితగతిన ప్రక్రియ పూర్తి అయ్యేలా చూడాలని సూచిస్తున్నారు.
నిరపయోగంగాదుకాణ సముదాయం
ఆదాయం కోల్పోతున్న
వ్యవసాయ మార్కెట్
ఓపెన్ యాక్షన్ విస్మరించిన
అధికార యంత్రాంగం
మడిగెల కోసం ఎదురు చూస్తున్న వ్యాపారులు
ఓపెన్ యాక్షన్కు సిద్ధం
మడిగెల నిర్మాణం పూర్తి అయింది. ఓపెన్ యాక్షన్కు సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శాఖ నుంచి ఆదేశాలు రాగానే టెండర్ ప్రక్రియ పూర్తిచేస్తాం. వచ్చే నెలలో సముదాయం ప్రారంభం అవుతుంది.
– సంతోష్కుమార్, కార్యదర్శి,
వ్యవసాయ మార్కెట్, ఇబ్రహీంపట్నం

మోక్షం కల్పించి.. వదిలేసి

మోక్షం కల్పించి.. వదిలేసి