
నూతన కమిటీ నియామకం
మంచాల: ముస్లిం మైనార్టీ కమిటీ ఆరుట్ల గ్రామం నూతన అధ్యక్షుడిగా మండల మాజీ కో ఆష్షన్ సభ్యుడు ఎండీ యూసుఫ్ అలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం గ్రామంలోని నూర్ మసీద్లో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడిగా యూసుఫ్, గౌరవ అధ్యక్షులుగా జానీపాష, సలాంబాయ్, ప్రధాన కార్యదర్శిగా బాబు మీయా, ఉపాధ్యక్షులుగా ఇస్మాయిల్, ఫయాస్, ఆసీఫ్ ఖాన్, ప్రధాన సలహాదారులు జిలానీ బాయ్, అక్బర్ బాయ్, సోషల్ మీడియా కార్యదర్శులుగా ఖాజా, హఫేజ్, కోశాధికారిగా జహంగీర్, మరో 11 మందిని సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.
వైభవంగా బీరప్ప పండుగ
యాచారం: మండల పరిధి మల్కీజ్గూడ గ్రామంలో ఆదివారం శ్రీబీరప్పస్వామి, కమరావతి దేవీల పండుగ ఘనంగా జరిగింది. కుర్మ సంఘం ఆధ్వర్యంలో భక్తులు నెత్తిన బోనంతో పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా వెళ్లి, స్వామివారికి నైవేద్యం సర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటిరమేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాష, గ్రామస్తులు వెంకట్రెడ్డి, శంకర్, మల్లేశ్, బోడ అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ పరామర్శ
ఆమనగల్లు: మండల పరిధి ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన వల్లపుదాసు బాలకిష్టయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి.. ఆదివారం బాధితున్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కేశవులు, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్ తదితరులు ఉన్నారు.
మురుగు నిలిచి..
దుర్గంధం వ్యాపించి
కేశంపేట: మండల పరిధిలోని బైర్కాన్పల్లి గ్రామ శివారులోని తెట్టేకుంటతండాలో మురుగునీరు ఇళ్ల మధ్యలో చేరి దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. మురుగు నిలిచే ప్రదేశంలోనే గ్రామ పంచాయతీకి సంబంధించిన బోర్ కూడా ఉంది. వ్యర్థ జలాలు బోర్లోకి వెళ్లే ప్రమాదం ఉందని, ఆ నీటినే తాగుతున్నామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇళ్ల మధ్యలోనే మురుగునీరు నిలవడంతో దుర్గంధంతో పాటు దోమబెడద పెరుగుతోందని వాపోతున్నారు. అధికారులు స్పందించి మురుగునీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు.
‘సైనికులను
అవమానించడం బాధాకరం’
మొయినాబాద్రూరల్: సైనికులను అవమానించడం బాధాకరమని బీజేపీ ఓబీసీ సెల్ జిల్లా కన్వీనర్ ఎలగని వెంకటేశ్గౌడ్ అన్నారు. ఆదివారం హిమాయత్నగర్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. భారత సైనికులను అవమానపరిచేలా.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఇతర నాయకులు హేళన చేస్తూ మాట్లాడడం బాధాకరమన్నారు. దేశాన్ని రక్షించుకునేందుకుపార్టీలు ముఖ్యం కాదని, ఐకమత్యంగా ఉన్నప్పుడే సైనికుల్లో ధైర్యం నింపగలుగుతామన్నారు. ఇకనైనా దేశ రక్షణలో ఉన్న వారిపై ఎవరు విమర్శలు చేయొద్దని కోరారు.

నూతన కమిటీ నియామకం

నూతన కమిటీ నియామకం

నూతన కమిటీ నియామకం