తెరపైకి పల్లె పోరు | - | Sakshi
Sakshi News home page

తెరపైకి పల్లె పోరు

May 26 2025 7:33 AM | Updated on May 26 2025 7:33 AM

తెరపైకి పల్లె పోరు

తెరపైకి పల్లె పోరు

ఆ పంచాయతీల్లో ఎన్నికలు

మండలంలోని 14 పంచాయతీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 18 గ్రామాలకు 4 పంచాయతీలను (తారమతిపేట, బాచారం, గౌరెల్లి, కుత్భుల్లాపూర్‌) పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో విలీనం చేశారు. మిగతా 14 గ్రామాల్లోని కొన్నింటిని కలిపి నగర పంచాయతీగా మార్పు చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ.. మూడు మాసాల క్రితం ఎంపీటీసీ స్థానాల కోసం అధికారులు డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ వెల్లడించడంతో ఈ సారి 14 గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని జిల్లా స్థాయి అధికారి ఒకరు పేర్కొన్నారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫున వస్తున్న ప్రకటనలతో పంచాయతీ పోరు తెరపైకి వస్తోంది. దీంతో పల్లెల్లో కొంతకాలంగా స్తబ్దుగా రాజకీయం.. వేడేక్కుతోంది. రాజకీయ నేతలు, ఆశావహుల్లో ఆరాటం మొదలయింది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా.. ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లాలా అని ఉవ్విళ్లూరుతున్నారు.

ముందు జెడ్పీనా.. పంచాయతా?

గత పాలకవర్గాల గడువు ముగిసి ఏడాదిన్నర కాలం గడిచింది. నాటి నుంచి ఇదిగో ఎన్నికలు అంటూ.. ప్రభుత్వం పలుమార్లు సంకేతాలు ఇచ్చినా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ప్రత్యేక అధికారుల పాలనతో పంచాయతీల పాలనను నెట్టుకోస్తోంది. తాజాగా వినిపిస్తున్న ప్రభుత్వ ప్రకటనలు, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్ధమేనని ఎన్నికల సంఘం చెబుతున్న మాటలతో నేతల్లో హడావుడి మొదలయింది. పోటీ చేసే అభ్యర్థుల కోసం సర్పంచ్‌, వార్డు సభ్యుల వారీగా గుర్తులను ఎంపిక చేయడంతో పాటు ఎంపీటీసీ స్థానాలకు డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ను కూడా అధికారులు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో స్థానిక ఎన్నికల సమయం ఆసన్నమైందనే భావన ప్రస్తుతం నెలకొంది. దీంతో పీసీసీ నేతలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ శ్రేణులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ పోరు గురించి చర్చిస్తున్నారు. కాగా జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు ముందు నిర్వహిస్తారా? పంచాయతీ ఎన్నికలు ముందు నిర్వహిస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.

ఎదురుచూపులు

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నేతలు తమ గ్రామంలో ఏ రిజర్వేషన్‌ వస్తుందోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గ్రామ జనాభా ప్రకారం ఆ ఊరిలో వచ్చే రిజర్వేషన్‌ ఏది ఉండవచ్చు అనే సందేహాలను తీర్చుకునేందుకు ఆశావహులు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండంలోని 18 గ్రామాల్లో.. నాలుగింటిని సమీప పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో విలీనం చేయడంతో ఆ గ్రామాల్లోని రెండు పంచాయతీల్లో గతంలో ఎస్సీ రిజర్వు ఉంది. అయితే ఆ రెండు ఎస్సీ స్థానాలను ప్రస్తుతం మిగిలిన 14 పంచాయతీల్లోని ఏ గ్రామంలో రిజర్వు చేస్తారనే సందేహంలో నేతలు ఉన్నారు. అటు రిజర్వేషన్లు ఫైనల్‌ కాక, మరో వైపు రిజర్వేషన్ల కోసం.. ఇంకో వైపు ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు జారీ చేస్తుందోనని నేతలు ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వ ప్రకటనలతో

నేతల్లో చిగురిస్తున్న ఆశలు

పార్టీ శ్రేణులతో విస్తృత సమావేశాలు

ఆశావహుల సందడి..

రిజర్వేషన్లు, నోటిఫికేషన్‌ కోసం ఆరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement