● త్వరగా పక్వానికి వచ్చేలా వ్యాపారుల అడ్డదారులు ● యథేచ్ఛగా కార్బైడ్‌ వినియోగం ● తాజాగా కన్పించేందుకు వ్యాక్స్‌, సింథటిక్‌ కలర్లు ● రంగు చూసి కొంటే మోసపోయినట్లే.. ● పట్టించుకోని అధికారులు | - | Sakshi
Sakshi News home page

● త్వరగా పక్వానికి వచ్చేలా వ్యాపారుల అడ్డదారులు ● యథేచ్ఛగా కార్బైడ్‌ వినియోగం ● తాజాగా కన్పించేందుకు వ్యాక్స్‌, సింథటిక్‌ కలర్లు ● రంగు చూసి కొంటే మోసపోయినట్లే.. ● పట్టించుకోని అధికారులు

May 6 2025 10:08 AM | Updated on May 6 2025 10:08 AM

● త్వ

● త్వరగా పక్వానికి వచ్చేలా వ్యాపారుల అడ్డదారులు ● యథేచ్

సాక్షి, రంగారెడ్డిజిల్లా: తీపిని పంచాల్సిన పండ్లు కడుపుల్లో విషాన్ని నింపుతున్నాయి. మామిడిప్రియుల ఆరోగ్యంపై దాడి చేస్తున్నాయి. రైతులు తమ పంటను పక్వానికి ముందే తెంపి మార్కెట్లోకి తరలిస్తున్నారు. సహజసిద్ధంగా పండాల్సిన పండ్లను కృత్రిమ పద్ధతి (త్వరగా పండేలా నిర్ధేశిత ప్రమాణాలకు మించి క్యాల్షియం కార్బైడ్‌ వినియోగం)లో మగ్గబెడుతున్నారు. కంటికి అందంగా కన్పించేందుకు వ్యాపారులు వ్యాక్స్‌, సింథటిక్‌ కలర్లు అద్దుతున్నారు. వెరసి తరచూ వీటిని కొనుగోలు చేసి తిన్నవారికి ఆరోగ్య సమస్యలు (జీర్ణకోశ, శ్వాస కోశ, నాడీ సంబంధిత సమస్యలు, చర్మంపై దద్దుర్లు) తప్పడం లేదు. ఎప్పటికప్పుడు ఆయా మార్కెట్లలో తనిఖీలు నిర్వహించి, పండ్ల నాణ్యతను పరిశీలించాల్సిన మార్కెటింగ్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కానీ, తూనికలు కొలతల అధికారులు కానీ అటు వైపు తొంగిచూసిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్‌కు వచ్చిన కాయలను త్వరగా మగ్గించి, అంతే త్వరగా సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో సామర్థ్యానికి మించి రసాయనాలు వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

తిన్న తర్వాత రుచీపచీ లేక..

విపరీతమైన మంచు కారణంగా పూత దశలోనే చాలా వరకు పంట దిగుబడి తగ్గింది. అంతో ఇంతో కాసిన కాయలు ఇటీవల ఈదురుగాలులతో కూడిన వర్షాలకు నేలరాలాయి. డిమాండ్‌ మేరకు ఉత్పత్తి లేకపోవడంతో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. కాయలు పక్వానికి రాకముందే వివిధ రసాయనాలు చల్లి మగ్గిస్తున్నారు. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలు అమాంతం పెంచేశారు. బహిరంగ మార్కెల్లో గత ఏడాది కిలో రూ.40 నుంచి రూ.60కే లభించిన పండ్లు ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100కుపైగా విక్రయిస్తున్నారు. వీధుల్లో తోపుడు బండ్లపై/మార్కెట్లో కంటికి అందంగా, సువాసన వెదజల్లుతూ కన్పించే ఈ పండ్లను తినేందుకు పిల్లలతో పాటు పెద్దలు సైతం ఇష్టపడుతుంటారు. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నారు. తీరా తిన్న తర్వాత రుచి లేకపోవడంతో ఉసూరుమంటున్నారు. కృత్రిమ పద్ధతిలో మగ్గించిన ఈ పండ్లను తరచూ తిన్నవారు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఏది సహజమో..? ఏది కృత్రిమమో..?

సహజంగా పండిన పండు ఆకుపచ్చ, పసుపు పచ్చరంగు మిశ్రమంతో కనిపిస్తుంది. ఇది సువాసన వెదజల్లుతుండటంతో పాటు పుల్లగా, తియ్యగా, రుచిగా ఉంటుంది. నీళ్లలో వేస్తే మునిగిపోతోంది. రసాయనాలతో పండిన పండుకు ఎలాంటి వాసన ఉండదు. రుచి, సుచి లేకుండా తింటే చప్పగా ఉంటుంది. పూర్తిగా పసుపు పచ్చ రంగులో కన్పించడంతో పాటు నీటిలో ఇట్టే తేలిపోతుంది. వ్యాపారులు సామర్థ్యానికి మించి రసాయనాలను వినియోగించినట్లు ధృవీకరిస్తే.. వారికి రూ.ఏడు లక్షల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఫుడ్‌ సేఫ్టీ, తూనికలు కొలతల అధికారులు మార్కెట్లలో తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

వినియోగిస్తున్న కార్బైడ్‌ ప్యాకెట్లు

ఆ రసాయనాలతో అనర్థాలు

మామిడి పండ్లు త్వరగా మగ్గించడానికి కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తుంటారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ వంటి ప్రభుత్వ సంస్థలు సైతం దీన్ని నిర్ధేశిత ప్రమాణాల మేరకు వాడుతుంటాయి. అవగాహన లోపానికి తోడు మార్కెట్లో నాణ్యమైన రసాయనాలు లేకపోవడంతో మెజార్టీ వ్యాపారులు తక్కువ ధరకు దొరికే కార్బైడ్‌ను వినియోగిస్తున్నారు. నిజానికి ఈ రసాయనాలను కాయకు తగలకుండా ప్రత్యేకంగా తయారు చేయించిన బాక్స్‌లో పెట్టి ఉంచాలి. చాలావరకు ఈ పౌడర్‌ను మామిడికాయల బాక్సుల్లో పొట్లాలు కట్టి ఉంచుతున్నారు. ఆ ప్యాకెట్‌ను నీటితో తడిపి పెడుతుండటంతో రసాయన ద్రావణం కాయ పై పడుతోంది. గాలి చొరబడకుండా గడ్డి/ పేపర్‌ను కప్పి ఉంచుతుండటంతో క్యాల్షియం కార్బైడ్‌ అసిలిటీస్‌ వాయువును విడుదల చేస్తుంది. ఇది అత్యధిక వేడిని కలిగిస్తుంది. వారం రోజుల్లో పండాల్సిన దాన్ని 12 నుంచి 24 గంటల్లోనే మగ్గిస్తుంది. అత్యంత చవకై నది కావడంతో వ్యాపారులు దీన్ని విరివిగా వినియోగిస్తున్నారు. కార్బైడ్‌లో ఆర్సెనిక్‌, పాస్పరస్‌ అవశేషాలు ఉండటంతో జీర్ణకోశ, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించేందు పండ్లు తాజాగా కలర్‌ఫుల్‌గా కన్పించేందుకు ఏకంగా వ్యాక్స్‌ కెమికల్స్‌తో పాటు, చైనా సింథటిక్‌ కలర్లు, కాయ ఎదుగుదలను ప్రోత్సహించే ఇథలిన్‌ వాయువును విడుదల చేసే ఎథేపాన్‌ వాడుతున్నారు. మోతాదుకు మించి వాడు తుండటంతో రుచి కూడా తగ్గిపోతోంది. పండ్లకు ఫంగస్‌ సోకకుండా ఉండేందుకు థియాబెండజోల్‌, కార్బైండజిమ్‌, సోడియం బైక్లోరైడ్‌ వంటి రసాయనాలు వినియోగిస్తున్నారు. ఇవి శ్వాసకోశ, చర్మ సంబంధిత సమస్యలకు దారితీస్తాయని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

● త్వరగా పక్వానికి వచ్చేలా వ్యాపారుల అడ్డదారులు ● యథేచ్1
1/2

● త్వరగా పక్వానికి వచ్చేలా వ్యాపారుల అడ్డదారులు ● యథేచ్

● త్వరగా పక్వానికి వచ్చేలా వ్యాపారుల అడ్డదారులు ● యథేచ్2
2/2

● త్వరగా పక్వానికి వచ్చేలా వ్యాపారుల అడ్డదారులు ● యథేచ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement