‘మిస్‌ వరల్డ్‌’కు ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

‘మిస్‌ వరల్డ్‌’కు ముస్తాబు

May 6 2025 10:08 AM | Updated on May 6 2025 10:08 AM

‘మిస్‌ వరల్డ్‌’కు ముస్తాబు

‘మిస్‌ వరల్డ్‌’కు ముస్తాబు

● సర్వాంగ సుందరంగా గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం ● అందాల పోటీలకు శరవేగంగా ఏర్పాట్లు ● ప్రధాన రహదారుల్లో ఆకర్షణీయంగా పచ్చదనం పెంపు

గచ్చిబౌలి: మిస్‌ వరల్డ్‌ పోటీలకు భాగ్యనగరం ఆతిథ్యమిస్తున్న వేళ చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభ వేడుకలకు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం ముస్తాబవుతోంది. ఇండోర్‌ స్టేడియంతో పాటు ఐటీ కారిడార్‌లో ప్రధాన రహదారులకు తుది మెరుగులు దిద్దుతూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ అతిథులను ఆకర్శించే రీతిలో రాష్ట్ర పర్యాటక శాఖ, జీహెచ్‌ఎంసీతో పాటు ఆయా విభాగాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. బయో డైవర్సిటీ జంక్షన్‌ నుంచి హెచ్‌సీయూ డిపో వరకు ఇప్పటికే గ్రీనరీ పనులు చేపట్టారు. అర్బన్‌ ఫర్నిచర్‌, మీడియన్లు, రోడ్లకు రెండు వైపులా ఏర్పాటు చేసిన గ్రీనరీని మరింత ఆకర్శణీయంగా తీర్చిదిద్దుతున్నారు. రోడ్ల వెంబడి గోడలకు రంగురంగుల పెయింటింగ్స్‌ వేస్తున్నారు. గచ్చిబౌలి, ట్రిపుల్‌ఐటీ, సైబర్‌ టవర్‌, హైటెక్స్‌ జంక్షన్లలో ఆహ్లాదంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మిస్‌ వరల్డ్‌ వేడుకల్లో భాగంగా గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం, హైటెక్స్‌, శిల్పారామం, ట్రైడెంట్‌ హోటల్‌, శిల్పకళా వేదిక, టి–హబ్‌లలో ఈవెంట్లు నిర్వహించనున్నారు. వీటన్నింటినీ కలుపుతూ ప్రధాన రహదారులు, జంక్ష న్లలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

● గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో పోటీల ప్రారంభ వేడుకలతో పాటు జానపద కళాకారుల కార్యక్రమం ఉంటుంది. దీంతో స్టేడియంలోని రోడ్లకు ఇరువైపులా మొక్కలు, పచ్చిక బయలు నాటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. డెలిగేట్స్‌కు భోజన ఏర్పాట్లకోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

● గాలి, వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ వాటర్‌ప్రూఫ్‌ గుడారాలను అమర్చారు.

● స్టేడియానికి వచ్చే వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

● గచ్చిబౌలి జంక్షన్‌, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌తో పాటు సైబర్‌ టవర్‌ నుంచి హైటెక్స్‌, బయోడైవర్సిటీ జంక్షన్‌ నుంచి సైబర్‌ టవర్‌, గచ్చిబౌ లి నుంచి కొత్తగూడ, గచ్చిబౌలి నుంచి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వరకు ప్రధా న రహదారుల వెంట చిందరవందరగా ఉన్న కేబుల్స్‌పై టీజీపీడీసీఎల్‌ అధికారులు దృష్టి సారించారు. ఆటంకం లేకుండా విద్యు త్‌ సరఫరా చేసే విధంగా మరమ్మతులు చేపట్టారు.

క్రీడాకారుల పెయింటింగ్స్‌

2002లో జరిగిన 32వ జాతీయ క్రీడల నిర్వహణతో గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. దాదాపు 23 ఏళ్ల నుంచి స్టేడియం రంగులకు కూడా నోచుకోలేదు. మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌తో ఇప్పుడు స్టేడియానికి రంగులు వేస్తున్నారు. గోడలపై రాష్ట్ర క్రీడాకారులు వీవీఎస్‌ లక్ష్మణ్‌, పుల్లెల గోపీచంద్‌, గగన్‌నారంగ్‌, మిథాలీరాజ్‌, సైనా నెహ్వాల్‌, సానియా మీర్జా, ముఖేష్‌ కుమార్‌తో పాటు పలువురు క్రీడాకారుల చిత్రాలు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement