
వృద్ధ దంపతుల దారుణ హత్య
బంగారం, నగదు చోరీ
అల్వాల్: వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు నగలతో పాటు, ఇంట్లో ఉన్న నగదు ఎత్తుకెళ్లిన సంఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూర్యనగర్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, మాణిక్యారం గ్రామానికి చెందిన కనకయ్య (70), రాజమ్మ (65) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కావడంతో బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. ఊరిలో వ్యవసాయం చేసుకునే కనకయ్య, రాజమ్మ వయసు మీద పడడంతో పిల్లల వద్ద ఉందామనే ఆలోచనతో మూడేళ్ల క్రితం నగరానికి వచ్చారు. కనకయ్య అల్వాల్, సూర్యనగర్లో వాచ్మెన్గా పనిచేసేవాడు. కొన్నాళ్ల క్రితం అతను అనారోగ్యానికి గురి కావడంతో ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సమీపంలో ఉంటున్న కూతురు లత ఇంటికి వెళ్లి సామన్లు సర్దుకునేందుకు అవసరమైన సంచులు కూడా తెచ్చుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వారి కుమార్తె లత ఇంటికి వచ్చి చూడగా తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో మంచంపై విగతజీవులై పడి ఉన్నారు. ఇద్దరి తలలపై గాయాలు ఉన్నాయి. సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లత కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాగిలాలను రప్పించి పరిసరాల్లో తనిఖీలు చేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఇంట్లో చొరబడి దొంగతనాలు పాల్పడి ఉంటారని, ఈ క్రమంలోనే వారిపై దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రాజమ్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, వెండి పట్టీలు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కనకయ్య తమ వద్ద ఉన్న నగదు అవసరమైన వారికి వడ్డీకి ఇచ్చే వాడని తాను ఊరికి వెళ్లి రూ. లక్ష తీసుకువచ్చానని, అవసరం ఉన్న వారికి వడ్డీకి ఇస్తానని చెప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న బాలానగర్ డీసీపీ సుధీర్ కుమార్, ఏసీపీ రాములు, సీఐ రాహుల్దేవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
అనంతగిరి: గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తుందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానందరెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కులలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులను స్థానిక బూత్ కమిటీ అధ్యక్షులు సుద్దగళ్ల లింగమయ్య, మైస నరేష్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదానందరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులను ఇస్తుందన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కృషితో మరిన్ని నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో దిశ కమిటీ మెంబర్ వడ్ల నందు, రాష్ట్ర దళిత మోర్చా కార్యదర్శి నవీన్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు శివరాజ్గౌడ్, మాజీ ఎంపీటీసీ గోపాల్, యువకులు పాల్గొన్నారు.