
రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు
రేపటి నుంచి 13 వరకు తొమ్మిది బృందాల పర్యటన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్తంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల ఐదు నుంచి 13 వరకు తొమ్మిది బృందాలు, 54 గ్రామాల్లో పర్యటించి సహజ వనరులు, పంట మార్పిడి, చెట్ల పెంపకం, సాగునీటి యాజమాన్యం, విత్తనాలు, రసాయనాల కొనుగోలు చేసిన రసీదులను భద్రపరుచుకోవడం వల్లే చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించనున్నట్లు సహజ వనరుల విభాగం సంచాలకురాలు డాక్టర్ కేపీ వాణి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. జిల్లాలోని మొయినాబాద్, కొత్తూరు, చేవెళ్ల, శంషాబాద్, మహేశ్వరం మండలాల్లోని రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సర్వే షురూ..
కందుకూరు: ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం సేకరించి పరిహారం చెల్లించిన భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు అధికారులు శనివారం సర్వే పనులు ప్రారంభించారు. మండల పరిధిలోని మీరాఖాన్పేట, పంజుగూడ రెవెన్యూలో గతంలో సేకరించిన భూములను సర్వేచేసి వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేయనున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫ్యూచర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ కృష్ణంరాజుతో పాటు కందుకూరు సీఐ సీతారామ్, పహడీషరీప్ డీఐ జితేందర్రెడ్డి పర్యవేక్షణలో నలుగురు ఎస్ఐలు, 60 మంది పోలీసు కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫెన్సింగ్ విషయంలో రైతులకు ఇబ్బందులు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని, అందుకు తాము సహకరిస్తామని సీఐ కృష్ణంరాజు ఈ సందర్భంగా తెలిపారు.
పీడీ పోస్టుకు
దరఖాస్తుల ఆహ్వానం
షాద్నగర్రూరల్: గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్(పీడీ) పోస్టుకు మహిళా అభ్యర్థులు దరకాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె శనివారం ఓ ప్రకటనలో కోరారు. కళాశాలలో ఖాళీగా ఉన్న పీడీ పోస్టు భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అర్హులు ఈ నెల 7వ తేదీలోగా తమ అర్హత సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలన్నారు.
పాలిసెట్ ఎంట్రెన్స్కు ఉచిత శిక్షణ తరగతులు
షాద్నగర్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశాల కోసం ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ పరమేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్ ఎంట్రెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల 5వ తేదీ నుంచి ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు క్లాసులు కొనసాగుతాయని తెలిపారు.
ప్రభుత్వ పథకాలతో పేదలకు మేలు
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి
మొయినాబాద్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పామెన జ్యోతి అన్నారు. శనివారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ మున్సిపల్ ఉపాధ్యక్షురాలిగా చిలుకూరు మాజీ సర్పంచ్ గునుగుర్తి స్వరూపకు నియామకపత్రం అందజేశారు. అనంతరం జ్యోతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు