కష్ట కాలం
న్యూస్రీల్
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల తీరు..
బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025
‘వడ్లు నేర్పుతున్న ఇతని పేరు గోగూరి బాపురెడ్డి. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన బాపురెడ్డికి 13 ఎకరాల భూమి ఉంది. ఆరున్నర ఎకరాల్లో సన్నవడ్లు, మరో ఆరున్నర ఎకరాలు దొడ్డువడ్లను సాగు చేశాడు. పది రోజుల వరి కోసి ధాన్యం ఆరబెడితే.. నాలుగుసార్లు వర్షాలు పడడంతో ఆరినవడ్లు తడుస్తున్నాయి. రూ.2,500 చొప్పున రెండు, రూ.3,000 చొప్పున నాలుగు కవర్లు కొని వడ్లను ఆరబోసి ఇలా నేర్పుతున్నారు. ధాన్యం తూకం వేసేందుకు సీరియల్ నంబరు వచ్చినా వర్షంతో తేమ శాతం రాక తూకం ఆగిపోయింది.’
‘తడిసిన వడ్లను నేర్పుతున్న ఈ వృద్ధ రైతుపేరు నేవూరి నర్సింహారెడ్డి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇతనికి 9 ఎకరాల భూమి ఉంది. 15రోజుల క్రితం 3, పదిరోజులు కిందట మూడెకరాలు వరి కోశాడు. ఇంకా మూడెకరాలు కోసేది ఉంది. కోసిన వడ్లను ఆరబెడితే అకాల వర్షాలకు నాని మొలక వచ్చింది. మొలకొచ్చిన వడ్లను చూపుతూ, గిసొంటి కాలం ఎన్నడూ చూడలేదంటూ వాపోతున్నాడు. ధాన్యం ఆరబెట్టేందుకు గోస అవుతుందని, ఆరిన వడ్లు మల్లా తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జల్లులపై జల్లులు పడడంతో ఇలా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు.’
సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా మంగళవారం వేకువజామున వర్షం కురిసింది. కల్లాల వద్ద ఆరబెట్టిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొందరు రైతులు వడ్లను కుప్ప చేసి కవర్లు కప్పారు. కానీ, చాలామంది గాలికి వడ్లు ఆరుతాయని ఆరబెట్టడంతో మరోసారి తడిశాయి. జిల్లాలోని చందుర్తిలో అత్యధికంగా 20.8 మి.మీ వర్షం పడగా.. రుద్రంగి 2.8, వేములవాడరూరల్ 7.0, బోయినపల్లి 10.3, వేములవాడ 7.8, సిరిసిల్ల 7.7, కోనరావుపేట 1.4, వీర్నపల్లి 4.2, ముస్తాబాద్ 3.4, తంగళ్లపల్లి 13.8, ఇల్లంతకుంటలో 13.4 మి.మీ వర్షం కురిసింది. పక్షం రోజుల వ్యవధిలో మూడుసార్లు వర్షాలు కురియడంతో జిల్లాలో ధాన్యం తూకం వేసేందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. కష్టకాలం దాపురించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
నిదానంగా కొనుగోళ్లు
అకాల వర్షాలతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నిదానంగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా తేమ శాతం కారణంగా కాంటాలు పెట్టడం లేదు. 17 శాతం కంటే తక్కువ తేమ ఉంటేనే తూకం వేస్తారు.
కోతలకు ప్రతిబంధకాలు
జిల్లాలో వరి కోతలకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే 98 వేల ఎకరాల్లో కోతలు పూర్తి కాగా, ఇంకా 86 వేల ఎకరాల్లో కోయాల్సి ఉంది. నిత్యం వర్షం జల్లులు పడడంతో మడి తడారక హార్వెస్టర్లు పొలాల్లో తిరిగే పరిస్థితి లేదు. చైన్ హార్వెస్టర్లు అందుబాటులో లేక కోతలు సాగడం లేదు. వర్షాలు తగ్గితేనే కోతలు వేగంగా సాగుతాయి. కల్లాల్లో వడ్లు ఆరి తేమశాతం రానుంది.
పత్తి రైతులదీ ఇదే పరిస్థితి
జిల్లాలో పత్తి రైతుల స్థితి ఇలాగే ఉంది. పత్తి పంట పగిలినా ఏరుకునే పరిస్థితి లేదు. నిత్యం వర్షాలతో రేగడి నేలల్లో పత్తి ఏరేందుకు వీలు కావడం లేదు. చెట్లపైనే తడిసిపోయి నల్లబడే ప్రమాదం ఉంది. జిల్లాలో 46వేల ఎకరాల్లో పంట సాగైంది. ఇప్పటికే పది శాతం పంటను రైతులు ఏరగా.. ఇంకా 90 శాతం మేరకు చేనులోనే ఉంది. వర్షాలు తగ్గితేనే పత్తి ఏరే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
హరిదాస్నగర్ శివారులో వడ్లను
ఆరబెడుతున్న రైతులు
సాగైన వరి: 1,84,860 ఎకరాలు
దిగుబడి అంచనా: 3.65 లక్షల
మెట్రిక్ టన్నులు
ఐకేపీ కేంద్రాలు: 156
ప్యాక్స్ కేంద్రాలు: 74
డీసీఎంఎస్ కేంద్రాలు: 01
మెప్మా కేంద్రాలు: 07
ఇప్పటి వరకు కొన్నది: 23,283.520 మె.ట
సన్నరకం: 636.120 మె.ట
వడ్లను అమ్మిన రైతులు: 3,612
ధాన్యం విలువ: రూ.55.62 కోట్లు
డబ్బులు పొందిన రైతులు: 122
చెల్లించిన డబ్బులు: రూ.2.32 కోట్లు
కష్ట కాలం
కష్ట కాలం
కష్ట కాలం
కష్ట కాలం


