
● జూలైలోగా వంద శాతం పూర్తి చేయాలి ● చేనేత, జౌళిశాఖ జేడీ
సిరిసిల్ల: రేయింబవళ్లు ఇందిరా మహిళాశక్తి చీరలు ఉత్పత్తి చేయాలని, జూలైలోగా వందశాతం పూర్తి చేయాలని చేనేత, జౌళిశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్.వెంకటేశ్వర్రావు సూచించారు. బీవై నగర్లోని జౌళిశాఖ ఆఫీస్లో శుక్రవారం వస్త్రోత్పత్తిదారులతో చీరల ఉత్పత్తిపై సమీక్షించారు. జేడీ మాట్లాడుతూ రెండు విడతల్లో ఇచ్చిన చీరల ఆర్డర్లలో నెలాఖరులోగా 50 శాతం చీరలను పూర్తి చేయాలని, జూలై నెలాఖరులోగా వందశాతం ఉత్పత్తి చేయాలన్నారు. ఆగస్టు 15న చీరల పంపిణీకి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు. రాత్రి షిప్ట్ను మళ్లీ పునరుద్ధరించాలని సూచించారు. వస్త్రోత్పత్తిదారుల వద్ద నిల్వ ఉన్న చీరల బట్టను వెంటనే గోదాముకు పంపించాలని సూచించారు. గతంలో బతుకమ్మ చీరలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో కోతలు విధించారని వస్త్రోత్పత్తిదారులు జేడీకి తెలపగా.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జేటీవో ప్రభాకర్, ఏడీలు రాఘవరావు, హిమజకుమార్, గౌతమ్, సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, వస్త్రోత్పత్తిదారులు రవి, బూట్ల నవీన్, మండల సత్యం, అనుమాండ్ల రాంనారాయణ, ఆసాములు బీమని రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.