
ప్రైవేటు ఇసుక.. ప్రభుత్వ బిల్లులు !
● రెవె‘న్యూ’ బాగోతం–2 ● ఇసుక పర్మిట్లలో కొత్త కోణం ● ‘సాక్షి’ కథనంతో రంగంలోకి ఆర్డీవో ● విచారణలో వెలుగుచూసిన పలు విషయాలు
సిరిసిల్లటౌన్: ప్రైవేట్ పనులకు ప్రభుత్వ వే బిల్లులు ఇవ్వడం సిరిసిల్లలో చర్చనీయంగా మారింది. జిల్లా కేంద్రం శివారులోని మానేరువాగు నుంచి ప్రైవేట్ పనులకు వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లకు ప్రభుత్వ పనులకు సంబంధించిన వే బిల్లులు ఇచ్చినట్లు విచారణలో తేలింది. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల ఇసుక ప్రైవేట్ పనులకు వెళ్తున్న విషయంపై ‘సాక్షి’లో వచ్చిన కథనం స్థానికంగా దుమారం రేపింది. ఉన్నతాధికారుల్లో కదలిక రావడంతో కలెక్టర్ ఆదేశాలతో సిరిసిల్ల ఆర్డీవో శనివారం మానేరువాగులోని ఇసుకరీచ్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ వే బిల్లులను ప్రైవేటు పనులకు ఇస్తున్నట్లు తేలింది. ఈ విషయం స్థానికంగా చర్చకు దారితీసింది.
విచారణ చేపట్టిన ఆర్డీవో
సిరిసిల్ల ఇసుకరీచ్ నుంచి ఇందిరమ్మ ఇండ్లతోపాటు ప్రైవేటు వ్యక్తులకు వే బిల్లులను శుక్రవారం రెవెన్యూ అధికారులు కేటాయించిన విషయంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈమేరకు సిరిసిల్ల ఇసుకరీచ్లో ఆర్డీవో వెంకటేశ్వర్లు శనివారం తనిఖీలు చేపట్టారు. రీచ్లో వందలాది సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు ఉండగా వాటికి కేటాయించిన వేబిల్లులపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్ల వద్దకు పోయి వేబిల్లులు పరిశీలించారు. ప్రైౖవేటు నిర్మాణం పనులకు ప్రభుత్వ రశీదులు ఇస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రైవేటు పనులకు అందించే వేబిల్లు బుక్కులు అయిపోవడంతో ప్రభుత్వ వేబిల్లులను అందించినట్లు అధికారులు బదులిచ్చారు. ఈవిషయమై ఆర్డీవోను వివరణ కోరగా.. అసలు ప్రభుత్వ వేబిల్లులు ప్రైవేటు పనులకు అందించే అవకాశంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.
జాబితా ఇందిరమ్మ.. వేబిల్లులు ప్రైవేటు
ప్రైవేటు పనులకు ఇసుక పర్మిట్ల జాబితా సిరిసిల్ల మండలం ఇందిరమ్మ ఇండ్ల పనులకు అని ఉండడం పలు అనుమానాలను తావిస్తోంది. ఈనేపథ్యంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు శనివారం ప్రైవేటు పనులకు ప్రభుత్వ రశీ దులు అందించడాన్ని గ మనించి వాటిని ప్రైవేటు వేబిల్లులుగా సవరించినట్లు సమాచారం. ఆర్డీవో రాకతో అధికారులు ట్రాక్టర్లను చాలా సమయం అక్కడే నిలిపివేశారు. చలాన్లు చెల్లించి పర్మిట్లు పొందిన ప్రైవేటు వ్యక్తులు, ట్రాక్టర్ల నిర్వాహకులు ఇలా ట్రాక్టర్లు నిలిపివేయడంతో ఇ బ్బందిపడ్డారు. ప్రభుత్వానికి చలాన్ చెల్లించి పర్మి ట్లు పొంది ఇసుక తీసుకెళ్తుంటే ఎందుకు అవాంతరాలు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సిరిసిల్లో రెవె‘న్యూ’ లీలల వ్యవహారం ఎన్ని రో జులుగా సాగుతోంది, బాధ్యులు ఎవరన్న విషయం ఉన్నతాధికారుల విచారణలో తేల నుంది.
బాధ్యులకు
మెమో ఇచ్చాం
ఇందిరమ్మ ఇండ్లతోపాటు ప్రైవేటు వ్యక్తులకు ఇసుక పర్మిషన్ ఇచ్చిన విషయంలో అక్రమాలు జరుగలేదు. ప్రైవేటు వ్యక్తులు జిల్లా కలెక్టర్ పేరున రెండు రోజుల క్రితమే డీడీ రూపంలో రూ.19,200 చెల్లించారు. అందుకే వారికి కూడా అనుమతులు జారీ అయ్యాయి. ఈ అంశం ఉన్నతాధికారుల విచారణలో ఉంది. ఇప్పటికే ఓ అధికారికి మెమో ఇవ్వడం జరిగింది. – మహేశ్కుమార్, తహసీల్దార్, సిరిసిల్ల

ప్రైవేటు ఇసుక.. ప్రభుత్వ బిల్లులు !