
సారూ.. ఆదుకోరూ..
‘సార్ నా పేరు షేక్ జలీల్. మాకు సిరిసిల్లలోని విద్యానగర్ బైపాస్రోడ్డులో సర్వేనంబరు 517లో స్థలం ఉంది. మా స్థలంలో హోటల్ పెట్టుకోవాలని చూస్తుంటే ఓ బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు బెదిరిస్తున్నాడు. అతనితోపాటు మరికొందరు నేతలకు సంబంధించిన భూమి అదే సర్వేనంబర్లో ఉండగా బైపాస్రోడ్డులో పోయింది. ఆ స్థలానికి వారు పరిహారం కూడా పొందారు. ఇప్పుడు నిరుపేద అయిన నా స్థలాన్ని కాజేయాలని చూస్తుండ్రు. ఈవిషయం నేను గత నెలలో ప్రజావాణిలో మిమ్మల్ని కలిస్తే ఆర్డీవోకు రాసి తహసీల్దార్తో ఎంక్వయిరీ చేయించాలని రాశారు. అక్కడికి వెళితే రికార్డు నేను ఇచ్చిన ఫైలు కాపీలు లేవు అంటున్నారు.. అంటూ కలెక్టర్తో మొరపెట్టుకున్నారు.
సిరిసిల్లటౌన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పెద్ద ఎత్తున కలెక్టరేట్ బాట పడుతున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తమ సమస్యలు విన్నవించేందుకు భారీగా తరలివచ్చారు. రోజుల తరబడి పెండింగ్లోనే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేయగా.. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దని అధికారులకు సూచించారు. రెవెన్యూ 51, ఏడీఎస్ఎల్ఏ 7, డీఈవో 7, డీఆర్డీవో 6, డీడబ్ల్యూవో 5, సివిల్ సప్లయ్, ఎస్సీ కార్పొరేషన్, ఉపాఽధి కల్పన శాఖలకు మూడు చొప్పున, సిరిసిల్ల మున్సిపల్, బోయినపల్లి ఎంపీడీవోకు రెండు చొప్పున, ఎస్పీ, ఎస్డీసీ, నీటి పారుదల శాఖ, సెస్, ఎకై ్సజ్, మిషన్ భగీరథ, ఎల్డీఎం, హ్యాండ్లూమ్ ఏడీ, సీపీవోకు ఒక్కొక్కటి చొప్పున మొత్తంగా 134 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఈర్డీవో శేషాద్రి, ఆయా శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సారూ.. పదహారోసారి నేను రావడం. మాది చందుర్తి మండలం రాజారాంపల్లి. నా భార్య బోజుగారి గంగవ్వ పేరున ఊరి శివారులో 20 గుంటల జాగ ఉంది. యాభై ఏళ్ల కింద మా నాన్న రెండకరాల భూమిని కొనగా వారసత్వంగా మాకు వచ్చింది. ధరణి వచ్చాక స్థలం ఆన్లైన్లోకి రాలేదు. మీరే స్పందించి మా భూమికి పట్టాచేసి పాస్పుస్తకం ఇప్పించాలి..’ అంటూ బోజగారి మల్లేశం కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులను పిలిచి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.