
బోనస్ ఎప్పుడొచ్చేనో?
● నెల క్రితమే సన్నధాన్యం కొనుగోళ్లు పూర్తి ● జమైన ధాన్యం డబ్బులు ● బోనస్ కోసం ఎదురుచూపులు ● జిల్లాలో 87,732 క్వింటాళ్ల సన్నవడ్లు సేకరణ ● రైతులకు రూ.4.38కోట్ల బోనస్ బకాయి
ముస్తాబాద్(సిరిసిల్ల): సన్నవడ్ల బోనస్ కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఎండాకాలం సీజన్లో సన్నధాన్యం సాగుచేసిన రైతులు వర్షాకాలం మొదలుకావడంతో మళ్లీ పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. బోనస్ డబ్బులు వస్తే విత్తనాలకు, ఎరువులకు, దున్నకం, నాటువేసే కూలీల ఖర్చుకు ఉపయోగపడతాయని ఆశపడ్డ రైతులకు ఎదురుచూపులే దిక్కయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 87,732 క్వింటాళ్ల సన్నధాన్యాన్ని రైతులు పండించగా.. వారికి రూ.4.38కోట్ల బోనస్ రావాల్సి ఉంది. కొనుగోళ్లు పూర్తయి డబ్బులు ఖాతాల్లో జమకాగా.. సన్నవడ్ల బోనస్ క్వింటాల్కు రూ.500చొప్పున మాత్రం రాలేవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తమ ఖాతాల్లో వేస్తే వానాకాలం పంటల సాగుకు ఉపయోగపడతాయని ఆశలో అన్నదాతలు ఉన్నారు.
రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ
జిల్లాలో 242 కొనుగోలు కేంద్రాల ద్వారా దొడ్డు రకం 2.7 లక్షల మెట్రిక్ టన్నులను 32,556 మంది నుంచి సేకరించారు. సన్నరకం వడ్లు 87,732 క్వింటాళ్లు సేకరించారు. నెల రోజుల క్రితమే సన్నధాన్యం సేకరణ పూర్తయింది. డబ్బులు దాదాపు తొంభై శాతం రైతుల ఖాతాల్లో జమచేశారు. కానీ సన్నరకంపై రావాల్సిన రూ.4.38కోట్ల బోనస్ మాత్రం రైతుల ఖాతాల్లో జమకాలేదు.