
అధికారుల నిర్లక్ష్యం.. పేద కుటుంబానికి శాపం
● ఇంటినంబరు తప్పు మంజూరుతో ఇరకాటం ● అధికారులను వేడుకుంటున్న పేద కుటుంబం ● మున్సిపల్ తప్పునకు ఇల్లు కోల్పోతున్న బాధితులు
సిరిసిల్లటౌన్: మున్సిపల్ అధికారులు చేసిన తప్పు.. ఓ నిరుపేద కుటుంబానికి శాపంగా మారింది. ఇంటినంబర్ తప్పుగా నమోదు చేయడం.. పాత నంబర్ను ఇతరులకు కేటాయించడంతో మంజూరైన ఇందిరమ్మ ఇల్లు రద్దయ్యేలా ఉంది. బాధితులు తెలిపిన వివరాలు. నేతకార్మికుడు అరికాల పాపయ్యకు స్థానిక 11వ వార్డులో స్థలం ఉంది. రాజీవ్నగర్.. సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం కాకముందు గ్రామపంచాయతీగా ఉండేది. ఆ సమయంలో వీరు నివసించిన ఇంటి నంబర్ 11–55గా ఉండేది. దీనిని గ్రామపంచాయతీ కార్యదర్శి 11–56గా ఇచ్చారు. ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఇల్లు కట్టుకుంటామంటే అసలు ఇంటి నంబర్ లేదని, ఆ ఇంటి నంబర్ వేరేవాళ్లకు కేటాయించారన్నారు. దీంతో తమ ఇంటి రికార్డ్స్ మున్సిపాలిటీలో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ప్రజావాణిలో మున్సిపల్ ప్రత్యేకాధికారి, కలెక్టర్కు విజ్ఞప్తి చేయగా.. సిరిసిల్ల మున్సిపల్ అధికారులను దీనిపై చర్యలు తీసుకోమని ఆదేశించారన్నారు. మున్సిపల్కు వెళ్తే ఈ ఇంటి నంబర్ వేరే వాళ్లకు ఇచ్చామని.. తమకు కొత్త ఇంటి నంబర్ ఇస్తామంటున్నారని వాపోయాడు. కలెక్టర్ జోక్యం చేసుకొని తమకు కేటాయించిన ఇంటి నంబర్నే ఇవ్వాలని కుటుంబ సభ్యులు శారద, జశ్వంత్ కోరుతున్నారు. సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారుల తప్పిదానికి పేద కుటుంబానికి సొంతింటి కల దూరం చేయొద్దని కోరారు.

అధికారుల నిర్లక్ష్యం.. పేద కుటుంబానికి శాపం