
జిల్లా కోర్టు ప్రధాన పాలనాధికారిగా మాధవి
సిరిసిల్లకల్చరల్: జిల్లా న్యాయస్థానం ప్రధాన పాలనాధికారిగా పి.మాధవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు నుంచి బదిలీపై జిల్లా కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు మ ర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుఛ్చం అందించి స్వాగతించారు. జిల్లాకు మంజూరైన న్యాయనిర్మాణ్ కోర్టు భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. బా ర్ అసోసియేషన్ కార్యదర్శి తంగళ్లపల్లి వెంకటి, ఉపాధ్యక్షుడు అనిల్కుమార్, కోశాధికారి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
వేములవాడలో 80 ఫీట్ల మేర రోడ్డు విస్తరణ
సిరిసిల్ల/వేములవాడ: జిల్లాలోని వేములవాడ పట్టణంలో 80 ఫీట్ల మేర రోడ్డు విస్తరణ పనులు చేపడతామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం తెలిపారు. పట్టణంలోని మూలవాగు నుంచి శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ, భూసేకరణపై కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. పట్టణంలో వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేస్తుండగా పనులు పరిశీలించామని, గజానికి ధర ఎంతో ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదన్నారు. భూసేకరణలో గజానికి ధర ఎంతో తాను ప్రకటించలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. రోడ్డు డిజైన్, నిర్మాణ గడువు అంశాలను తాను ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరగాలి
ముస్తాబాద్/గంభీరావుపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా వైద్యాధికారి రజిత అన్నారు. బుధవారం ముస్తాబాద్ మండలం గూడెం, ఆవునూర్ ఆరోగ్య ఉపకేంద్రాలు, గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయన్న విషయాన్ని ఏఎన్ఎమ్లు, ఆశ వర్కర్లు ప్రచారం చేయాలన్నారు. పీవోఎంహెచ్ఎన్ అంజలి, డీఐవో సంపత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వేధింపులకు గురైతే 181కు ఫోన్ చేయండి
సిరిసిల్ల: మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను కల్పించిందని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎంఐ సురేశ్ ఆదేశాలతో బుధవారం మహిళా ఉద్యోగులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గృహ హింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణ చట్టం, నిర్భయ చట్టం ద్వారా మహిళలు ఎదుర్కొనే హింసలను నిరోధించుకోవచ్చని వివరించారు. మహిళలు ఏ సందర్భంలోనైనా లైంగిక, మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులకు గురైతే 181 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వైద్యం, న్యాయం, పోలీస్, కౌన్సెలింగ్, షెల్టర్ వంటి సహాయాల్ని పొందవచ్చని సూచించారు. మహిళా సాధికారత కేంద్రం కో ఆర్డినేటర్ రోజా, బెటాలియన్ ఏవో ఇ.ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
సమ్మె నోటీస్ అందజేత
సిరిసిల్లటౌన్: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ నేతలు కోరారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఈనెల 20న చేపట్టే సార్వత్రిక సమ్మె నోటీస్ను బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మధ్యాహ్న భోజన రంగం సంఘం తరఫున అందజేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఈనెల 20న జిల్లా కేంద్రానికి వచ్చి సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గురిజల శ్రీధర్, నాయకులు ఆంజనేయులు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కోర్టు ప్రధాన పాలనాధికారిగా మాధవి

జిల్లా కోర్టు ప్రధాన పాలనాధికారిగా మాధవి