
ఎండతో అప్రమత్తంగా ఉండాలి
● వడదెబ్బ లక్షణాలుంటే.. ఆస్పత్రికి వెళ్లండి ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల: ఎండలతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. ఎండలు, వడగాలులతో జరిగే ప్రమాదాల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. వేసవికాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు బయటికి రాకూడదని సూచించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడ దెబ్బలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. చిన్నారులు, వయోవృద్దులతో ప్రయాణం శ్రేయస్కరం కాదని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇంటి నుండి బయటికి వస్తే తలకు ఎండ తగలకుండా గొడుగు, కండువా,టోపితో కవరు చేయాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలకు 108 కు ఫోన్ చేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకం పనులు కూలీలు ఉదయం 6 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 6 గంటలు వరకు పనులు చేపించాలని, పనులు జరుతున్న ప్రదేశాల్లో రక్షణ, జాగ్రత్తలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
భూభారతిలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలి
భూ భారతి చట్టం ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. హైదరాబాద్ నుంచి వీసీలో సమీక్షించారు. ఈ నెల 5 నుంచి మే 20 వరకు జిల్లాలో ఒక్క మండలాన్ని పైలెట్గా తీసుకొని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలన్నారు. జూన్ 2వ తేదీ వరకు ఆ దరఖాస్తులను పరిష్కరించాలని మంత్రి కోరారు.
నీట్ పరీక్షలపై
జిల్లాలో నీట్ పరీక్ష కేంద్రాలను ముందుగా జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి ఏర్పాట్లు పర్యవేక్షించాలని అన్నారు. సీసీ కెమెరాలు, అవసరమైన మేర పోలీస్ భద్రత కల్పించాలని అన్నారు. ప్రశ్న పత్రాలు స్టోర్ చేసే స్ట్రాంగ్ రూం వద్ద సీసీటీవీ ఉండాలని, పోలీస్ బందోబస్తుతో పరీక్ష కేంద్రాలకు ప్రశ్నా పత్రాలను తరలించాలని అన్నారు. పరీక్ష కేంద్రాల గేటు మధ్యాహ్నం 1.30 గంటలకు మూసి వేయాలని, ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించాలని, బయో మెట్రిక్ అటెండెన్స్ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సిరిసిల్ల, వేములవాడ ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయి, డీఆర్డీవో శేషాద్రి, హౌసింగ్ పీడీ శంకర్ పాల్గొన్నారు.