
కల్తీ ఆహారం.. తనిఖీలు శూన్యం
ఇది సిరిసిల్లలోని ఓ ప్రముఖ సూపర్మార్ట్లోనిది. ఎలాంటి గుర్తింపు, అనుమతి లేకుండా తినుబండారాలను ఇలా పెట్టెలకొద్దీ విక్రయిస్తున్నారు. ఫుడ్సేఫ్టీ అనుమతులతోపాటు ప్యాకెట్స్పై తయారీదారుల పేరు, గడువు తేదీ, బరువు, ధర ఇలా.. ఏది ముద్రించిలేదు. కానీ సిరిసిల్ల మార్కెట్లో ఇలాంటి జీరో దందాలు సర్వసాధారణం.
మీరు చూస్తున్న ఈ ఫొటో సిరిసిల్ల మటన్ మార్కెట్లో విక్రయిస్తున్న మాంసం. దీనిపై మున్సిపల్ అధికారులు వెటర్నరీ వైద్యుడిచే పరీక్షించి నాణ్యమైనదిగా గుర్తించి సీల్ వేయాల్సి ఉంటుంది. కానీ సిరిసిల్లలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. దశాబ్దాల తరబడిగా ఇక్కడ స్లాటర్హౌస్ లేక, మున్సిపల్ అధికారులు మాంసం విక్రయాలను గాలికి వదిలేశారు.
సిరిసిల్లటౌన్: జిల్లాలోని హోటళ్లు.. రెస్టారెంట్లు..ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో కల్తీ ఆహారం విక్రయాలతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కల్తీ ఆహార విక్రయాలను నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. సూపర్మార్ట్లలో కంపెనీ పేరు లేకుండా, తయారీ తేదీ, గడువు తేదీలు లేకుండానే ఆహారపదార్థాలను విక్రయిస్తున్నారు. జిల్లాలో నాసిరకం ఆహార వ్యాపారంపై ‘సాక్షి’ ఫోకస్.
హోటల్ ఫుడ్.. హెల్త్ బ్యాడ్
జిల్లాలో రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. ఫలితంగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. హోటళ్ల నిర్వాహకులు నాణ్యమైన ఆహార పదార్థాలు, నూనెలు వినియోగించాల్సి ఉండగా.. అత్యధిక వాటిల్లో నాసిరకం వాడుతున్నట్లు సమాచారం. నాణ్యమైనవి, బ్రాండెడ్ వాడాలంటే ఖరీదు కాబట్టి..తక్కువ ధరకు దొరికే పదార్థాలు, నూనెలు వాడుతున్నారు. రుచి కోసం ఆహారంలో నిషేధిత రంగులు, రసాయనాలు కలుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే నాణ్యమైనవి వాడుతున్నామని ఫాస్ట్సెంటర్ నిర్వాహకులు చెబుతున్నా ఏళ్ల తరబడిగా అధికారుల పర్యవేక్షణ లేకుండా ఉండటం విమర్శలకు తావిస్తోంది. గతంలో పలు హోటళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో కలుషితనీరు, పాడయిన ఆహార పదార్థాలు, నిలువ ఉంచిన సూప్స్, కాలం తీరిన సాస్లు దొరికిన సంఘటనలు ఉన్నాయి. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వహణపై తనిఖీలు చేపట్టే అధికారం ఉన్న శాఖలు మామూళ్లుగా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 200లకు పైగా ఫాస్ట్ఫుడ్ సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలో రోజుకు రూ.15లక్షలు, నెలకు రూ.4.50కోట్లలో ఫాస్ట్ఫుడ్ దందా సాగుతోందని వ్యాపారవర్గాల అంచనా.
నాసిరకం నూనెలు.. స్టోర్డ్ఫుడ్ వినియోగం
రంగులు, రసాయనాలతో ఆరోగ్యం చిత్తు
పుట్టగొడుగుల్లా సెంటర్లు
జిల్లాలో 200 ఫాస్ట్ఫుడ్ సెంటర్లు
రోజూ రూ.లక్షల్లో వ్యాపారం
నియంత్రించలేని అధికారులు
కొన్ని సంఘటనలు
ఇటీవల సిరిసిల్లలోని ఓ ప్రముఖ హోటల్కు మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. అక్కడ మురిగిపోయిన ఉల్లిగడ్డలు, కూరగాయలు చూసి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వేములవాడలోని ఓ ప్రముఖ బేకరీకి సిరిసిల్ల నుంచి నలుగురు యాత్రికులు వెళ్లారు. కూల్కేక్ తీసుకుని నోట్లో పెట్టుకోగానే కుళ్లిపోయినట్లు తేలింది. విషయం గమనించిన హోటల్ యజ మాని వెంటనే కేక్ను బయట పారేయించారు.
సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇద్దరు స్నేహితులు ఫాస్ట్ఫుడ్కు వెళ్లి ఇష్టమైన ఫుడ్ను తినేశారు. ఇంటికి వెళ్లాక రాత్రి వేళలో వాంతులు, విరేచనాలు కావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నట్లు సమాచారం.
ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నాం
సిరిసిల్లలోని రెస్టారెంట్లు, ఇతర ఫుడ్స్టాల్స్పై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదుకాలేదు. ఆహార విషయంలో నాణ్యత పాటించని స్టాల్స్, హోటల్స్పై మాకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. వంటశాలలు, హోటల్స్ పరిశుభ్రంగా ఉంచాలి. మాంసాహారం, సూప్లు నిలువ ఉంచినవి వాడొద్దు. నిబంధనలు పాటించాలి. లేకుంటే కేసులు నమోదు చేస్తాం.
– ఎస్.సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్

కల్తీ ఆహారం.. తనిఖీలు శూన్యం

కల్తీ ఆహారం.. తనిఖీలు శూన్యం

కల్తీ ఆహారం.. తనిఖీలు శూన్యం

కల్తీ ఆహారం.. తనిఖీలు శూన్యం