
అనువంశిక అర్చకులకు ప్రాతినిధ్యం కల్పించాలి
● ట్రస్టు అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ
వేములవాడ: రాజన్న గుడి విస్తరణ కార్యక్రమాల్లో అనువంశిక అర్చకులకు ప్రాతినిధ్యం కల్పించడానికి శృంగేరి పీఠాధిపతుల వద్దకు ప్రతినిధి వర్గంగా వెళ్లి చర్చించాలని అనువంశిక అర్చక బ్రాహ్మణ ట్రస్టు అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని శంకరమఠంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజన్న ఆలయ విస్తరణకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవ అభినందనీయమన్నారు. జూన్ 15 నుంచి విస్తరణ పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తమను భాగస్వామ్యం చేయాలని కోరారు. 1970–74లో జరిగిన తొలి విస్తరణ పనుల్లో అనువంశిక అర్చకులకు అప్పటి అధికారులు తగిన ప్రాతినిధ్యం కల్పించారని గుర్తు చేశారు. ఈసారి శృంగేరి పీఠాధిపతులను మాత్రమే సంప్రదిస్తూ.. తమ అభిప్రాయాలకు చోటు కల్పించకపోవడం విచారకరమన్నారు. ఆలయంలో ఖాళీలుగా ఉన్న 22 పరిచారక పోస్టులను అనువంశిక పురోహితులతో భర్తీ చేయాలని కోరారు. అనువంశిక నాయకులు ఉపాధ్యాయుల సాంబశివుడు, వజ్జల సతీశ్, సంకేపల్లి నాగేంద్రశర్మ, ఎం.కె.మూర్తి పాల్గొన్నారు.