సిరిసిల్లటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధివిధానాలు మానుకోవాలని భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో సవరణలు చేయాలని కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇస్తామన్న రూ.4వేల జీవన భృతి వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై తక్షణమే నిషేధం విధించాలన్నారు. అసంఘటిత కార్మిక రంగానికి బోర్డులను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. ఈనెల 29న రాష్ట్ర బీడీ కార్మిక సంఘ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించే మహాసభను కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు సుధీర్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేశ్, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిలివేరి కృష్ణయ్య, మహిళా కార్యకర్తలు మంజుల, కీర్తి పాల్గొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని సింగారం వద్ద బుధవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. సింగారంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు బియ్యం తరలిస్తున్న వాహనం పట్టుబడింది. మండలంలోని నారాయణపూర్కు చెందిన అనరాసి దేవరాజు తన ఆటోలో సుమారు 10 క్వింటాళ్ల బియ్యాన్ని గంభీరావుపేట మండలం లింగన్నపేట రైస్మిల్లుకు తరలిస్తుండగా పట్టుకున్నారు. గ్రామాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి బియ్యం తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బియ్యంతో పాటు ఆటోను సీజ్ చేసి దేవరాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.