అంతా స్వాహాకారమే | - | Sakshi
Sakshi News home page

అంతా స్వాహాకారమే

Mar 19 2025 12:41 AM | Updated on Mar 19 2025 12:40 AM

● ‘సెస్‌’లో అవినీతిపై సభ్యుల ఆగ్రహం ● ఎన్పీడీసీఎల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ ● పాలకవర్గాల అవినీతి, అక్రమాలతోనే సంస్థ పతనం ● విద్యుత్‌ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో ఆ‘వేదనలు’

సిరిసిల్ల: యాభై ఏళ్ల క్రితం సిరిసిల్ల ప్రాంతంలో వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేసిన సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌)లో నేడు అంతా స్వాహాకారమే రాజ్యమేలుతోందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సెస్‌’ పాలకవర్గాల అవినీతి, అక్రమాలతో పాలన సాగిస్తున్నాయన్నారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ‘సెస్‌’ 2025–2026 వార్షిక ఆదాయం సవరణపై మంగళవారం తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ డాక్టర్‌ డి.నాగార్జున్‌ బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యుత్‌ వినియోగదారులు, ‘సెస్‌’ గ్రామీణ ప్రతినిధులు పాల్గొని సంస్థ పని తీరును ఎండగట్టారు.

ఇంత నిర్లక్ష్యమా..

జిల్లాలో విద్యుత్‌ లూజ్‌ వైర్లతో రైతులు ట్రాక్టర్‌తో దున్నే పరిస్థితి లేదని, హార్వెస్టర్లతో వరికోతలు కోసేందుకు ఇబ్బందిగా మారిందని, మిడిల్‌ పోల్స్‌ను వేసి లూజ్‌ వైర్లను సరిచేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. విద్యుత్‌ పంపిణీలో లైన్‌ లాస్‌ కేవలం ‘సెస్‌’ సిబ్బంది కనుసన్నల్లోనే విద్యుత్‌ చౌర్యం జరుగుతోందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే మరోటి వేయాలంటే ట్రాన్స్‌పోర్టు పేరిట రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురైన గ్రామాల్లో విద్యుత ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, వైర్లు ఇతర పరికరాలను దొంగచాటుగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని పలువురు సభ్యులు ఆరోపించారు. పవర్‌లూమ్స్‌కు విద్యుత్‌ సరఫరాలోనూ అక్రమాలు జరుగుతున్నాయన్నారు. బదిలీలు లేకుండా 20 ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోవడంతో అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

చిత్తశుద్ధితో పని చేస్తున్నాం

సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌ కంటే మెరుగైన విద్యుత్‌ పంపిణీ సేవలు అందిస్తున్నామన్నారు. 26 నెలల తమ పాలనలో రూ.11కోట్లు ఉన్న డిమాండ్‌ను రూ.22కోట్లకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. వ్యవసాయానికి 5 హెచ్‌పీల వరకు విద్యుత్‌ ఉచితంగా ఉందని, కానీ ఎక్కువ మంది రైతులు 7.5 హెచ్‌పీలు, 10 హెచ్‌పీలు, 12.5 హెచ్‌పీలు, 15 హెచ్‌పీలు విని యోగిస్తుండడంతో విద్యుత్‌ లైన్‌లాస్‌ వస్తోందని వివరించారు. టారిఫ్‌ రేట్లను ప్రతీ యూనిట్‌కు పది పైసలు తగ్గించాలని, సభలో రాజకీయ కక్షలతో కొందరు అవినీతి ఆరోపణలు చేశారన్నారు. ‘సెస్‌’ ఎండీ విజయేందర్‌రెడ్డి ముందుగా ‘సెస్‌’ వార్షిక నివేదకను, విద్యుత్‌ కొనుగోలు, పంపిణీ లెక్కలను వివరించారు. సభలో సభ్యులు చెప్పిన అంశాలను, అవినీతి ఆరోపణలను నోట్‌ చేసుకున్నామని, విచా రణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నా రు. టీజీఈఆర్‌సీ మెంబర్‌ సెక్రటరీ వి.రామచందర్‌, ‘సెస్‌’ వైస్‌ చైర్మన్‌ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, మల్లుగారి రవీందర్‌రెడ్డి, సందుపట్ల అంజిరెడ్డి, వరుస కృష్ణహరి, కొట్టెపల్లి సుధాకర్‌, ఆకుల గంగారాజం, అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఎల్‌.శ్రీనివాస్‌రెడ్డి, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అంతా స్వాహాకారమే1
1/1

అంతా స్వాహాకారమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement