
● ఎండాకాలంలో అటవీజంతువులకు అండగా.. ● నీటికుండీలు ఏర్పాట
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎండాకాలంలో అటవీలోనూ నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. వాగులు, వంకలు, చెలిమెల్లో నీరింకిపోయింది. ఈక్రమంలో దాహార్తి తీర్చుకునేందుకు అటవీ జంతువులు అల్లాడుతున్నాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో గ్రామాల శివారులోని పంటపొలాలకు నీటి కోసం వన్యప్రాణులు వస్తున్నాయి. ఈక్రమంలో రైతులు పెడుతున్న విద్యుత్ కంచెలకు తాకి కరెంట్ షాక్తో చనిపోతున్నాయి. ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టేందుకు అటవీశాఖ అధికారులు ముందుకొచ్చారు. అడవిలోనే వన్యప్రాణులు దప్పిక తీర్చుకోవడానికి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు రేంజ్ల పరిధిలో 78 నీటి కుండీలను ఏర్పాటు చేసి వాటికి తాగునీరు అందిస్తున్నారు.
ట్యాంకర్ల ద్వారా సరఫరా..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పశ్చిమ డివిజన్లో దట్టమైన అటవీ ప్రాంతం రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఉంది. ఇక్కడ పచ్చని అడవి విస్తరించి ఉండడంతో ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో వన్యప్రాణులు బతుకుతున్నాయి. వర్షాకాలం, శీతాకాలాల్లో అటవీలోని నీటివనరుల్లో దాహార్తి తీర్చుకునేవి. ప్రస్తుతం ఎండలు ముదిరిపోవడంతో ఫారెస్ట్లోని నీటి వనరులు అడుగంటిపోయాయి. ఆకురాలే కాలంలో అడవిలో ఆహారం దొరక్క, నీరు లేక జిల్లాలోని గంభీరావుపేట మండలంలోని పెద్దమ్మజంగల్, చందుర్తి, రుద్రంగి, వీర్నపల్లి, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, జగిత్యాల జిల్లా మల్యాల ప్రాంతాల్లో వన్యప్రాణులు చనిపోతున్నాయి. మరీ ముఖ్యంగా కోతులు నీటి కోసం గ్రామాల్లోకి వస్తున్నాయి. అటవీ జంతువులు గ్రామాల్లోకి నీటి కోసం రావడం ప్రమాదాలకు గురి కావడం జరుగుతోంది. దీంతో గ్రామీణులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వన్యప్రాణుల ఇబ్బందులను గుర్తించిన అధికారులు దట్టమైన అడవిలో నీటి తొట్టిలను ఏర్పాటు చేసి నిత్యం ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు.
రెండు రేంజ్ల పరిధిలో..
రాజన్నసిరిసిల్ల జిల్లాలో రెండు ఫారెస్ట్ రేంజ్లు సిరిసిల్ల, వేములవాడ. సిరిసిల్ల రేంజ్ పరిధిలో 58 నీటితొట్టీలు, సాసర్లను నిర్మించారు. వీటిలో నీటిని నింపేందుకు 3 ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. వేములవాడ రేంజ్ పరిధిలో 20 నీటి తొట్టిలను గతంలోనే ఏర్పాటు చేశారు. అవే తొట్టిలలో అధికారులు నిత్యం నీరు నింపుతూ.. వన్యప్రాణుల దహార్తిని తీర్చుతున్నారు. కాగా ఎల్లంపల్లి కాలువల ద్వారా వేములవాడ రేంజ్లోని కొన్ని ప్రాంతాల్లో నీటి కాలువలు ఉండడం మూలంగా అక్కడే జంతువులు దాహార్తిని తీర్చుకుంటున్నట్లు అధికారులు చెపుతున్నారు.
దాహార్తిని తీరుస్తున్నాం..
ఎండాకాలంలో అడవిలో నీటి వనరులు ఎండిపోతుంటాయి. ఈ నేపథ్యంలో అటవీ జంతువుల దాహార్తి తీర్చేందుకు నీటితొట్టీలు, సాసర్లను నిర్మించి, ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నాం. వన్యప్రాణులు కుండీల వద్దకు వచ్చి దాహార్తి తీర్చుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా.. శాఖాపరంగా నీటితొట్టీలను ఏర్పాటు చేస్తున్నాం. వన్యప్రాణుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీహరిప్రసాద్, సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి