
వెంకన్న ఆస్తుల పరిరక్షణకు చర్యలు
సిరిసిల్లటౌన్: శ్రీశాల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ సహాయ కమిషనర్ ఎన్.సుప్రియ స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని సర్వే నంబర్ 1578లో సుమారు 40 ఏళ్ల క్రితం అక్రమంగా నిర్మించిన 23 నుంచి 30 నివాసాలను సందర్శించి మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ప్రతీ ఇంటికి రూ.1000 డ్యామేజ్ సూట్ కింద పేమెంట్ చేయాలని కోరారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో రూ.1.60లక్షలతో కొత్తగా నిర్మించిన షెడ్డును ప్రారంభించారు. ఆలయ పునర్నిర్మాణానికి శాఖాపరంగా పనులు పూర్తి చేస్తామని, భక్తులు కూడా సాయం అందించాలని కోరారు. కార్యక్రమాల్లో ఆలయ ఈవో మారుతిరావు, శివసాయిబాబా ఆలయ ఈవో శ్రీనివాస్, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఏఈవో పీసరి రవీందర్, మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, తీగల శేఖర్గౌడ్, చేపూరి నాగరాజు, అర్చకులు మాడంరాజు కృష్ణమాచారి, వర్దనాచారి తదితరులు పాల్గొన్నారు.