అక్క, చెల్లెలితో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ
కూతురు..
● ఆడపిల్ల భారం కాదు.. ప్రోత్సహిస్తే అండగా నిలుస్తుంది ● కళలు, క్రీడలు, చదువులు, ఉద్యోగాల్లో రాణిస్తున్న పలువురు ● నేడు అంతర్జాతీయ కూతుళ్ల దినోత్సవం
పేద కుటుంబంలో పుట్టాం
పెద్దపల్లిరూరల్: మాది జగిత్యాల జిల్లా కొడిమ్యాల. మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం. పేద కుటుంబంలో పు ట్టాం. అమ్మానాన్న జడల రామస్వామి, లక్ష్మి. నా న్న ఇంటివద్దే దుస్తులు అమ్మి, కుటుంబాన్ని పోషించారు. ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదువుకున్నాం. ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఉన్న మమ్మల్ని అమ్మానాన్న ప్రోత్సహించారు. అక్క రాజమణి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివి, ప్రభుత్వ టీచర్గా కరీంనగర్లో పని చేస్తోంది. నేను 2012లో ఐఏఎస్ సాధించా. పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్గా పని చేస్తున్న. నా భర్త శ్రీనివాస్ ప్రభుత్వ టీచర్. మాకు ఇద్దరు అహిలన్, అభిషన్ సంతానం. చెల్లెలు జ్యోతి ఎం.కాం చదివి, హైదరాబాద్లో బ్యాంకింగ్ రంగంలో అకౌ ంట్స్ ఆఫీసర్గా పని చేస్తోంది. 4 మాసాల క్రితం నాన్న చనిపోవడం తీరని బాధను మిగిల్చింది.
ముగ్గురూ ఉద్యోగులే
కథలాపూర్(వేములవాడ): మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామానికి చెందిన మండల కిష్టయ్య–సత్తమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు సరిత, సవిత, కీర్తి ఉన్నారు. వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. సరిత పీజీ, బీఈడీ పూర్తి చేసి, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించి, ఇబ్రహీంపట్నం మండలంలో విధులు నిర్వహిస్తోంది. సవిత డిగ్రీ పూర్తి చేసి, ప్రైవేట్ టీచర్గా పని చేస్తోంది. కీర్తి 2020లో పోలీస్శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి, కథలాపూర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది. తాము కూతుళ్లనే కొడుకులు భావించి, ఉన్నత చదువులు చదివించామని, వారు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించడంతో తమ కల నెరవేరిందని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మేం నలుగురు ఆడపిల్లలం
జగిత్యాల: మాది ప్రకాశం జిల్లా. నేను హైదరాబాద్లో పుట్టి, పెరిగాను. మేం నలుగురు అక్కాచెల్లెల్లం. నాన్న షేక్ యూసుఫ్ పాషా ఎక్స్ సర్వీస్మెన్, తల్లి షబీరా హౌస్ వైఫ్. నలుగురు కూతుళ్లలో నేనే పెద్దదాన్ని. 2003లో గ్రూప్–1 రాసి, ఎంపీడీవోగా, 2009లోనూ రాసి, డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యాను. 2011లో మహబూబ్నగర్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాను. 2016లో రాజన్న సిరిసిల్ల జిల్లా కు జాయింట్ కలెక్టర్గా వచ్చాను. 2020లో వనపర్తికి కలెక్టర్గా వెళ్లాను. 1 ఫిబ్రవరి 2023న జగిత్యాల కలెక్టర్గా బాధ్యతలు చేపట్టాను. పెళ్లి జరిగి, ఇద్దరు పిల్లలు పుట్టాక ఇంటి వద్దే ఉంటూ వంట చేయడం, పిల్లలను చూసుకోవడం వంటివే జీవితం అనుకోలేదు. కష్టపడి చదివి, లక్ష్యాన్ని చేరుకున్నాను. పెద్ద చెల్లెలు నజీబీ లండన్లో స్థిరపడగా, రెండో చెల్లెలు పర్వీన్ టీఎస్ఎస్లో మంచి పొజిషన్లో ఉంది. చిన్న చెల్లెలు బీఫార్మసి పూర్తి చేసి, ఉద్యోగం చేస్తోంది. మా అమ్మానాన్న వారికి అందరూ ఆడపిల్లలే అని బాధ పడలేదు. చదువుల్లో ప్రోత్సహిస్తూ మా వెన్నంటి ఉన్నారు. వారి వల్లే మేము ఈ పొజిషన్లో ఉన్నాం. తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించాలి.
మా కల నిజం చేసింది
సిరిసిల్లకల్చరల్: మాది సిరిసిల్ల. మా అమ్మాయి శివాని పదోతరగతి నుంచి చదువుల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ చాటుతూ ముందుకు సాగింది. పదోతరగతిలో జిల్లా టాపర్గా నిలిచింది. ఇంటర్మీడియట్లో 968 మార్కులు సాధించింది. బీటెక్ ఈసీఈ పూర్తి చేసి, ప్రస్తుతం ఓ కంపెనీలో ఏడాదికి రూ.32 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్వేర్గా ఉద్యోగిగా పని చేస్తోంది. అమ్మాయి మా కల నిజం చేసినందుకు సంతోషంగా ఉంది.
కూతుళ్లతో కిష్టయ్య–సత్తమ్మ దంపతులు
కూతురు శివానితో టీచర్ కుమ్మరి మల్లేశం
జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా


