మార్కాపురం టౌన్: విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞానం, నైతిక విలువలు, మంచి అలవాట్లు నేర్చుకోవాలని కలెక్టర్ విజయ సునీత సూచించారు. పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం కిశోరీ వికాసం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 11 వరకు నిర్వహించే కిశోరీ వికాసం కార్యక్రమాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్, విద్య, సోషల్ వెల్ఫేర్, స్కిల్ డెవలప్మెంట్, మెప్మా శాఖల అధికారులు పలు విషయాలపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, పోషకాహారాల ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఇన్చార్జి పద్మావతి, డీఎల్డీఓ బాలూ నాయక్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాహుల్, నైపుణ్యాభివృద్ధి అధికారి కంచిబాబు, సీఐ అల్తాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలులో పోస్టర్ ఆవిష్కరణ
ఒంగోలు సబర్బన్: కిశోరీ వికాసం వేసవి కార్యక్రమం పోస్టర్ను శుక్రవారం కలెక్టర్ పి.రాజాబాబు స్థానిక ప్రకాశం భవన్లోని తన చాంబర్లో ఆవిష్కరించారు. కిశోరీ వికాసం కార్యక్రమంలో భాగంగా 11 నుంచి 18 ఏళ్ల పిల్లలకు విద్య ప్రాముఖ్యత, సంపూర్ణ ఆరోగ్యం, పోషకాహారం, రుతు పరిశుభ్రత, లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం, బాల్య వివాహాల నిషేధ చట్టం, టీనేజ్ ప్రెగ్నెన్సీ చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ నాగమణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, అర్బన్ సీడీపీఓ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్లు విజయ సునీత, రాజాబాబు


