యర్రగొండపాలెం: స్నేహితులకంటే మార్కులు తక్కువగా వచ్చాయని మనోవేదనకు గురైన టెన్త్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వైపాలెం మండలంలోని అమానిగుడిపాడులో గురువారం చోటుచేసుకుంది. నరసరావుపేటలోని ఒక పబ్లిక్ స్కూల్లో నంబూరి చంద్రశేఖర్ 10వ తరగతి చదివాడు. పబ్లిక్ పరీక్షలు పూర్తయిన వెంటనే స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులతోపాటు పొలం వద్దకు వెళ్తున్నాడు. టెన్త్లో పాసైనట్లు తల్లిదండ్రులకు చెప్పి పొలం నుంచి ఇంటికి వెళ్లాడు. స్నేహితులతో ఫోన్లో మాట్లాడి వారికి వచ్చిన మార్కులు తెలుసుకున్న చంద్రశేఖర్ తనకు తక్కువ మార్కులు వచ్చాయని మనోవేదనకు గురయ్యాడు. ఇంట్లో తాడుతో ఉరివేసుకోగా.. అదే సమయంలో అక్కడికి చేరుకున్న స్నేహితులు గమనించారు. స్థానికుల సహాయంతో ఉరిని తప్పించి యర్రగొండపాలెంలోని ఓ ప్రవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాలుడిని ఎంఈవో ఆంజనేయులు పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు.


