ఒంగోలు టౌన్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కార్మికులు విశ్రమించకుండా పోరాటాలు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తంబి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నగరంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ పరిసరాల్లోని నోయిడాలో లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు నిరంతర పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. కనీస వేతనాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారన్నారు. జిల్లాలోని 28 మండలాల్లో మేడే సందర్భంగా ఎర్రజెండాలు ఎగరేసి కార్మికుల సత్తా చాటాలని చెప్పారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు సయ్యద్ మున్వర్ బాషా, ముహమ్మద్ బేగ్, చిట్టిబాబు పాల్గొన్నారు.
ఒంగోలు: ఏపీ కుడో అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎంపిక మే 4న నిర్వహిస్తున్నట్లు ఏపీ కుడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరి శశిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక స్థానిక శ్రీనగర్ 1వ లైనులోని జూపిటర్ హైస్కూలులో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు జిల్లాకు చెందిన అన్ని కుడో క్లబ్లు, కోచ్లు, రిఫరీలు, క్రీడాకారులు, అర్హులైన సభ్యులు సకాలంలో హాజరై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరి శశిధర్ విజ్ఞప్తి చేశారు.


