సంతమాగులూరు (అద్దంకి): మిరపకాయల కోత కూలీల ఆటోను లారీ ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కొమ్మాలపాడు సమీపం అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిపై మంగళవారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం..కొమ్మాలపాడుకు చెందిన ఎనమిది మంది కూలీలు ఏల్చూరు గ్రామంలోని మిరపకాయల కోత కూలికి ఆటోలో బయల్దేరారు. ఆటోను కొమ్మాలపాడు నుంచి ఏల్చూరు మధ్యలోని ఓ డెయిరీ సమీపంలో వెనుకగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహబూబ్బీ, ఎస్కే ఖాశింబీ, రుక్సేనాకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నామ్ హైవే అంబులెన్సులో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. ఎస్సై పట్టాభిరామరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కూలీల ఆటోను లారీ ఢీకొట్టిన విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. అందులో ఎనిమిది మంది కూలీలు మాత్రమే ఉండటం, వారిలో ముగ్గురు గాయపడగా మిగిలిన వారు క్షేమంగా ఉండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మార్టూరు: మతి స్థిమితం లేని ఓ వ్యక్తి సెల్ టవర్ పైకి ఎక్కి హడావుడి చేసిన సంఘటన మార్టూరులో మంగళవారం రాత్రి కలకల రేకెత్తించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇతర రాష్ట్రానికి చెందిన మతి స్థిమితం లేని ఓ వ్యక్తి వ్యక్తి గత కొంతకాలంగా మార్టూరులో సంచరిస్తున్నాడు. స్థానిక కొణిదెన రోడ్డులోని వైన్స్ షాపుల సమీపంలో ఉన్న సెల్ టవర్ పైకి ఆ వ్యక్తి ఎవరు చూడకుండా టవర్ చివరి భాగం వరకు వెళ్లి అరుస్తున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించి అగ్నిమాపక వాహనాన్ని రప్పించారు. వాహనం వచ్చేలోగా ఎస్ఐ సుబ్బారావు గంటసేపు శ్రమించి సిబ్బందితో కలిసి ఆ వ్యక్తిని టవర్పై నుంచి జాగ్రత్తగా కిందికి దించారు. కిందికి దిగి వచ్చాక ఆ వ్యక్తి అతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు స్థానికులు గుర్తించారు.
ముగ్గురికి గాయాలు తప్పిన పెను ప్రమాదం


